సబావట్ హాథిరామ్ ‘నల్లింకు పెన్ను’ అనే కవితా సంపుటితో సాహితీ లోకానికి పరిచయమయ్యాడు. విద్యార్థి దశలోనే దేశ కాలమాన పరిస్థితుల పట్ల అవగాహనను పెంపొందించుకున్నాడు. నేటి రాజకీయ స్థితిగతులను కవిత్వం చేసే ప్రయత్నంలో అడుగులు వేస్తున్నాడు. తను రాసిన ‘ముగిసిన సభ’ అనే కవితను పరిశీలిద్దాం.
ఒక కవితను రాయాలంటే కవి ఆయా వస్తు సంబంధిత విషయాలను ఎంతో జీర్ణం చేసుకోవాలి. అందులోను రాజకీయ కవితను పలికించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇంకొంత ఎక్కువగానే అవగాహనను కలిగి ఉండాలి. రాజకీయ కవితను రాసేటప్పుడు చాలామంది కవులు వచనమైపోతారు. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప కవి ఆ కవితను ఫలవంతం చేయలేడు.కొంతమంది కవులు వ్యంగ్యాన్ని ఆసరాగా చేసుకుని రాస్తారు.కొంతమంది కవులు దూషణలు చేసి కవిత్వం చేస్తారు.రాజకీయ కవిత రాయటం క్లిష్టమైనది. ఇలాంటి సందర్భాల్లోంచి హాథిరామ్ మెరుగైన కవిత్వాన్ని రాస్తున్నాడు. ముగిసిన సభ అనే కవిత అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రాజకీయ నాయకులు ఎన్నికల ఎజెండాలో భాగంగా ప్రజలను కలుసుకొని తమ వైపు ముగ్గు చూపేలా వాళ్లకు కానుకలను ప్రకటిస్తారు.అవసరమైతే గదుమ పట్టుకుంటారు.ఇంకా అవసరమైతే పాదాలు కూడా పట్టుకోవడానికి వెనుకాడరు.ఒక్కొక్కరు ఒక్కో వ్యూహంతో ఆకట్టుకుంటారు.అందులో భాగంగానే సభలు ఏర్పాటు చేస్తారు.బస్సులు పెట్టి ప్రజలను సభా ప్రాంగణంకు తోలుకు పోతారు.వాళ్లకు విందు భోజనం పెట్టి కూలిగిట్టేలా రకరకాల ఏర్పాట్లు చేస్తారు. సభ ముగుస్తుంది.అందరూ వచ్చిన దారినే వెళ్లిపోతారు.ఇట్లాంటి సందర్భంలోంచి హాథిరామ్ చక్కటి కవితకు శ్రీకారం చుట్టాడు.సభలో రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారు? ప్రజల స్పందన ఎలా ఉంటుంది? వారిచ్చే వాగ్దానాలు ఎటువంటివి? అనే అంశాల మూల సూత్రంగా ఈ కవితను నడిపించాడు.
రాజకీయ నాయకులు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చాలా పకడ్బందీగా మాట్లాడతారు.ప్రజలు ఉద్వేగానికి లోనయి అప్పటికప్పుడు చప్పట్లు కొడతారు.సభ ముగిశాక చప్పట్ల శబ్దం మూగబోతుంది. దానిని కవి శ్మశాన నిశ్శబ్దమని ఎంతో వ్యంగ్యాత్మకంగా చిత్రించాడు. సభకు ఇష్టం లేకుండా ధనం మీద ఆశతో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కత్రిమంగా నవ్వుతారు. అందులో నిజం ఉండదు. అభిమానం అసలే ఉండదు. ఆ విషయాన్ని కవి చెప్పడానికి సభానంతరం ‘ఖాళీ కుర్చీలు’ ఎలా ఉంటాయో పోలుస్తూ కూలివాని ఎండిపోయిన డొక్కల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ పోలిక మారని బతుకుల స్థితిని తెలియజేస్తుంది. మైకు చేతిలో ఉందని నాయకులు ఎన్నో వాగ్దానాలు ఇస్తుంటారు. నమ్మబల్కుతుంటారు. అవన్నీ సాధ్యపడేవి కావని ప్రజలకు తెలుసు.’గుడ్డిలో మెల్ల’ అన్నట్టు నాయకులను ఎన్నుకోవడం తప్ప అంకితభావంతో పనిచేసే వారి సంఖ్య చాలా తక్కువే. ఈ కవిత ద్వారా కవి రాజకీయ నాయకుడి స్వభావాన్ని సభలు పెట్టడంలోని గుట్టును విప్పి చెప్పాడు.ఇది చిన్న కవితే కానీ చాలా అంశాలు చర్చకు తెచ్చిన మేలిమి కవిత.రాజకీయ నాయకుల అంతరంగాన్నే కాక పేదవాడి బ్రతుకుమారని స్థితిని కూడా అర్థం చేయించాడు.ఇలాంటి కవితలు ‘నల్లింకు పెన్ను’ కవితా సంపుటిలో చాలా ఉన్నాయి.ఈ కవితలోని నిర్మాణము కవి శ్రద్ధను తెలియజేస్తున్నది. రాయబోయే కవితల్లో ఆ శ్రద్ధను కనబరుస్తాడు అన్న నమ్మకము ఈ సంపుటి కలిగించింది.
– డా|| తండ హరీష్ గౌడ్, 8978439551