శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారుచేయలేని పదార్థాలలో రక్తం ఒకటి. మనదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాని అత్యవసర పరిస్థితుల నుండి కాపాడుకోవడానికి ఏటా సుమారు ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుందని అంచనా. అయితే రక్త దాతల నుంచి అందుబాటు అవుతున్నది మాత్రం 50 లక్షల యూనిట్లు మాత్రమే. మనదేశంలో ”ప్రతిరోజు” దాదాపు 12 వేల మంది రక్త కొరత కారణంగా చనిపోతున్నారు. రక్తదానం మీద ప్రచార కార్యక్రమాలు ఎంత పెరిగినప్పటికీ రక్తదాతలలో వస్తున్న స్పందన మాత్రం సరిపోయినంత లేదన్నది వాస్తవం. ఈ నెల 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
ఎబిఓ రక్త సమూహ వ్యవస్థను కనుగొన్నందుకు నోబుల్ బహుమతి గ్రహీతైన ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ ల్యాండ్ స్టైనర్ జన్మదినమైన జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా 2004 నుంచి జరుపుకుంటున్నాం. మనదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జాతీయ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నాం. మనదేశంలో ఇలా రెండు రకాల రక్తదాన దినోత్సవాలు జరుగుతున్నాయి. రక్తదాతలను గౌరవించడం, ప్రజలకు రక్తదాన ఆవశ్యకతను తెలియజేయడం, స్వచ్ఛంద రక్తదాతలను తయారుచేయడం ఈ దినోత్సవాల ఉద్దేశ్యం.
అవసరం చాలా..
ఎంత కొత్త వాహనమైన ఇంధనం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు కదలనట్లే, మనిషి శరీరంలో రక్తం అనే జీవ ద్రవపదార్థం ప్రవహించకపోతే జీవితం లేదు. మనిషికి ప్రాణవాయువు ఎంత అవసరమో మనకు తెలిసిందే. ఆ ప్రాణవాయువు కణజాలానికి అందేది రక్తం ద్వారానే. మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్తప్రసరణ ఎంతో అవసరం. రక్తం విలువ కట్టలేని పదార్థం. ప్రాణాపాయంలో సంజీవని వంటిది. ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, శరీరం కాలినప్పుడు, తలసిమియా, లుకేమియా, సికిల్ సెల్ అనిమియా లాంటి దీర్ఘకాలిక చిన్నపిల్లల వ్యాధుల చికిత్సకు, మూత్రపిండాల వ్యాధికి డయాలసిస్ చేసే సమయంలోను రక్తం అవసరం ఉంటుంది. రక్తం ఎటువంటి కర్మాగారాల్లో తయారు చేయలేనిది. మనుషులు స్వచ్ఛందంగా వారి శరీరం నుంచి దానం చేయవలసింది.
ఒక వ్యక్తి – నాలుగు ప్రాణాలు
ఒక వ్యక్తి చేసే రక్తదానం నాలుగు ప్రాణాలు కాపాడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రక్తం ఇవ్వగానే దానిని వివిధ భాగాలుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా ,ప్లేట్లెట్స్, తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు ఉంటాయి. వీటిని విడదీసి నలుగురికి ఈ రక్తాన్ని ఎక్కించవచ్చు. రక్తదాత నుంచి ప్లేట్లెట్స్ను మాత్రమే, ప్లాస్మాను మాత్రమే విడదీయగల సాంకేతిక అభివృద్ధి నేడు అందుబాటులోకి వచ్చింది. ఒక వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ రక్తదానం చేయవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మానుగానీ దానం చేయవచ్చు.
ఇబ్బందే ఉండదు..
రక్తదానం చేస్తే భావిజీవితంలో కోలుకోలేని ఇబ్బందులు వస్తాయని చాలామంది ప్రజలు భయపడుతుంటారు. వాస్తవానికి రక్తదానంతో ఎలాంటి ఇబ్బందులూ రావు. రక్తదానం తరువాత రెండు రోజులలో యథావిధిగా అన్నిరకాల పనులూ చక్కగా చేసుకోవచ్చు. రక్తదాన సమయంలో రక్తం సేకరించడానికి ఉపయోగించే సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్ననొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన బాధ ఉండదు. రక్తదానానికి ముందు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రక్తం తీసుకుంటారు. రక్తదానం తర్వాత ఆరు వారాల లోపు ఆ వ్యక్తిలో పూర్తిస్థాయిలో కొత్తరక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత ఏర్పడదు.
శరీరంలో ఎన్ని లీటర్లు..
ఒక వ్యక్తి శరీరంలో ఉన్న రక్తం మోతాదు వారి ఎత్తు, బరువు, వయస్సు ఆధారంగా నిర్ణయించబడుతుంది. సాధారణ వయోజన మానవ శరీరం దాదాపు ఐదు లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఈ మోతాదు 4,500 నుండి 5,700 మిల్లీలీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. గర్భిణీలలో 300 మి.లీ నుండి 400 మి.లీ రక్తం అదనంగా ఉంటుంది. గర్భిణీలలో ఉన్న ఈ అదనపు రక్తం ప్రసవ సమయంలో జరిగే రక్తస్రావాన్ని సరిచేస్తుంది.
కొన్ని సంగతులు..
- ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 11.85 కోట్ల యూనిట్ల రక్తం దానం చేయబడుతుంది. ఒక వ్యక్తి ఒక గంట కేటాయించి ఒక యూనిట్ రక్తాన్ని దానం చేస్తే. దానిని నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుంది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రకారం మనదేశం సంవత్సరానికి 20 లక్షల రక్త యూనిట్ల లోటుతో ఇబ్బందిపడుతోంది. ఎందుకంటే ప్రతి ఏడాది భారతీయ జనాభాలో ఒక్క శాతం మాత్రమే రక్తదానం చేస్తున్నారు.
- అమెరికన్ రెడ్క్రాస్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో ప్రతిరోజూ 36,000 యూనిట్ల ఎర్రరక్త కణాలు, 7,000 యూనిట్ల ప్లేట్లెట్లు మరియు 10,000 యూనిట్ల ప్లాస్మా అవసరం.
4.ప్రధాన మానవ రక్త గ్రూపులైన ఎ,బి, ఎబి, మరియు ఓ లను 1901లో డాక్టర్ కార్ల్ ల్యాండ్స్టైనర్ ద్వారా మొదట గుర్తించడం జరిగింది. వాటిని కృత్రిమంగా తయారుచేయడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఉదార మానవుల నుంచి సేకరించడమే ప్రస్తుతం ఉన్నటువంటి మార్గం.
5.ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్ అనేవి రక్తం నుండి విడగొట్టగలిగిన నాలుగు రకాల ట్రాన్స్ఫ్యూజబుల్ ఉత్పత్తులు. - ఎబి పాజిటివ్ రక్తం కలిగిన వారు సార్వత్రిక గ్రహీతలు. అంటే ఎబి వ్యక్తులు ఏ గ్రూపు రక్తాన్నయినా స్వీకరించగలరు. ఓ నెగటివ్ గ్రూప్ రక్తం కలిగినవారు విశ్వదాతలు. అంటే ఓ నెగిటివ్ గ్రూపు వారు ప్రపంచంలో ఏ గ్రూపు వారికైనా రక్తం దానం చేయవచ్చు.
- దానం చేసిన ప్లేట్లెట్స్ను ఐదు రోజులలోపు ఉపయోగించాలి. ఎర్ర రక్త కణాలను సేకరించిన తేదీ నుండి 42 రోజులలోపు ఉపయోగించాలి. ప్లాస్మా, క్రయోప్రెసిపిటేట్ వంటి రక్త ఉత్పత్తులను ఘనీభవించిన స్థితిలో నిల్వ చేస్తారు. ఈ ఉత్పత్తులను ఒక ఏడాది వరకు ఉపయోగించవచ్చు.
- దానం చేసిన అన్ని రక్త ఉత్పత్తులను రక్తమార్పిడి ముందు హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మరియు సిఫిలిస్ పరీక్షలను నిర్వహిస్తారు.
- అనవసరమైన రక్తమార్పిడులు చేసుకోకపోవడం మంచిది. అనవసర రక్త మార్పిడిలు జరిగినప్పుడు గ్రహీతలు ఎయిడ్స్, హెపటైటిస్, సిఫిలిస్ లాంటి మొండి రోగాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
- ప్రతి సంవత్సరం, సుమారు 300,000 మంది శిశువులు తలసేమియా, సికిల్-సెల్ వ్యాధితో పుడుతున్నారు. వారికి క్రమం తప్పకుండా జీవితకాలం పాటు రక్త మార్పిడి అవసరం.
- సంపూర్ణ రక్తదానాల మధ్య కనీస సమయం 56 రోజుల (8 వారాలు) నుండి 16 వారాల వరకు ఉండాలి. ప్లేట్లెట్ డొనేషన్లను వారానికి ఒక్కసారి చేయవచ్చు.
11.డిసెంబర్ 22 న, 1818లో ప్రసూతి వైద్య నిపుణులు జేమ్స్ బ్లండెల్ గారు మానవుని నుండి మానవునికి మొదటి రక్తమార్పిడిని చేపట్టారు.
యాప్..
ఇప్పుడు దరిదాపుగా ప్రతిదానికి ఒక యాప్ అందుబాటులో ఉంటోంది. రక్తదానానికి కూడా ఒక యాప్ అందుబాటులో ఉంది. రక్తదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారి కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ఈరక్తకోష్
(e-RaktKosh) అనే యాప్ను ప్రవేశపెట్టింది. రక్తం దానం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీంతోపాటు రెండ్ క్రాస్కి సంబంధించి ‘బ్లడ్ డోనార్ ‘ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్. ఓఆర్జి’ (Friends2support.org) తో
పాటు ఇతర యాప్లూ, వెబ్సైట్లూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రక్త దాతలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.
మానవత్వాన్ని చాటారు..
రక్తదానంపై అవగాహన ఉన్న లక్షలాది మంది మానవత్వాన్ని చాటుతున్నారు. ఇటీవల ఒడిశా రైలు ప్రమాదమే ఇందుకు నిదర్శనం.స్వచ్ఛందంగా అర్ధరాత్రి వేళ వందలాది స్థానికులు బాలాసోర్ ప్రభుత్వ దవాఖానలో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి, ప్రమాద బాధితులకు అవసరమైన రక్తాన్ని దానం చేశారు. బాలాసోర్లో రాత్రిపూట సుమారుగా 500 యూనిట్ల రక్తం సేకరించబడింది. తీవ్రంగా గాయపడినవారి చికిత్స కోసం పౌరులు రక్తదానం చేయడానికి రాత్రిపూట బారులు తీరారు.
తాత్కాలికంగా ఎవరు చేయకూడదు ?
1 మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి తప్పనిసరిగా మూడు నెలల లోపు రక్తదానం చేయకూడదు.
2. టైఫాయిడ్ నుండి కోలుకున్నాక సంవత్సరం రోజులు వరకు వేచి ఉండాలి.
3. క్షయవ్యాధి వ్యాధి ఉన్న రోగి నయం అయినట్లు నిర్ధారించబడిన తర్వాత తప్పనిసరిగా రెండేళ్లు వాయిదా వేయాలి.
4. ఎవరైనా పెద్ద సర్జరీ చేయించుకున్నట్లయితే 12 నెలలు, మైనర్ సర్జరీ చేయించుకుంటే ఆరు నెలలు వాయిదా వేయాలి.
5. స్త్రీల విషయంలో రుతుక్రమం, గర్భధారణ సమయంలో రక్తదానాన్ని వాయిదా వేయాలి.
6. కాన్పు అయిన తర్వాత ఒక్క సంవత్సరం వరకు వాయిదా వేయాలి.
7. అబార్షన్ జరిగితే ఆరు నెలలు వాయిదా వేయాలి.
8. బిడ్డకు పాలిస్తున్నంత వరకు తప్పనిసరిగా రక్తదానం చేయకూడదు.
ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ ఉంది. జనాభాలో నూటికి ఐదు మంది మాత్రమే ముందుకు వస్తున్నారు. ఇలా సరఫరా ఒకపక్క తగ్గిపోతుంటే మరొక పక్క వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. రక్తదానం చేయడానికి వృద్ధులు ఉపయోగపడరు. రక్తం అవసరం కూడా వీరికే ఎక్కువగా ఉంటుంది. కనుక రక్త దానం అవసరం పెరుగుతూ ఉంది. కృత్రిమంగా రక్తం తయారుచేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నా అవేవీ ఇంతవరకు సఫలీకృతం కాలేదు. ఈ సమస్యకు ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం రక్తదానమే !
ఎవరు శాశ్వతంగా చేయకూడదు..
– ఇన్సులిన్పై ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు.
– గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు.
– క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్నవారు.
– గుండెపోటుకు గురైనవారు.
– మూర్ఛవ్యాధి ఉన్నవారు.
– ఎయిడ్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్ లాంటి అంటువ్యాధులు ఉన్నవారు.
– దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు.
– ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు.
ఆరోగ్యంగా ఉన్న 18 సంవత్సరాలు పైబడిన వారందరూ రక్త దానం చేయవచ్చు. 18 ఏళ్ల నుంచి క్రమం తప్పక రక్తదానం చేయగలిగితే.. జీవిత కాలం మొత్తంలో దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు.
ముందు జాగ్రత్తలు..
– రక్తదానానికి ముందురోజు సరిపోయినంత నిద్రపోవాలి.
– రక్తదానానికి ముందు ఆరోగ్యకరమైన భోజనం తినాలి.
– రక్తదానానికి ముందు పుష్కలంగా నీరు తాగాలి.
– మీరు తీసుకుంటున్న లేదా ఇటీవల తీసుకున్న ఏవైనా మందులు రక్తదానం చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తాయో లేదో డాక్టరుకు చూపించి తనిఖీ చేయించుకోవాలి. ఉదాహరణకు, మీరు ప్లేట్లెట్ దాత అయితే, మీరు దానం చేయడానికి రెండు రోజుల ముందు తప్పనిసరిగా ఆస్పిరిన్ మాత్రలు తీసుకోకూడదు. రక్తదానం చేయడానికి ఏదైనా మందులు తీసుకోవడం ఆపడానికి ముందు మీ ఆరోగ్య సంరక్షణ బృందంలోని సభ్యునితో మాట్లాడాలి.
ప్రయోజనాలు..
రక్తదానం చేయడం వల్ల రక్తగ్రహీతకు ఒనకూడే ప్రయోజనంతో పాటు రక్తదానం చేసిన వ్యక్తికి కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
– రక్తదానం చేయడానికి ముందు రక్తదాత హెల్త్ ప్రొఫైల్ తెలుసుకుంటారు. దీంతో ఎప్పటికప్పుడు రక్తదాత ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
– రక్తదానం వలన పెద్ద పేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
– రక్తం దానం చేయగా తగ్గిన రక్త మోతాదును భర్తీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో దాత రక్తవ్యవస్థలో పునరుద్ధరణ జరుగుతుంది.
ఎవరు చేయొచ్చు..
– 18-60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు.
– బరువు 45 కిలోల పైన ఉన్నవారు
– బిపి అదుపులో ఉన్నవారు.
– తీవ్రమైన వ్యాధులు, మూర్ఛ, మూత్రపిండ వ్యాధులు, అలర్జీ, అసాధారణ రక్తస్రావ లక్షణాలు, త్వరితగతిగా బరువు కోల్పోవటం, హృదయ సంబంధమైన వ్యాధులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు ఇదివరకుగానీ ప్రస్తుతం గానీ లేకుండా ఉన్నవారు.
– రక్తపోటు, గుండె సంకోచించినప్పుడు (సిస్టాలిక్) 100-180 మి.మీ. వరకు, గుండె వ్యాకోచించినప్పుడు (డయాస్టాలిక్) 50-100 మి.మీ. వరకు ఉండాలి.
– హీమోగ్లోబిన్ 100 మి.లీ. రక్తంలో 12.5 గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి.
ఎవరు ఇవ్వకూడదు..
– గరాభవస్థలో, ప్రసవానంతరం ఆరు నెలల వరకు, బిడ్డకు పాలిచ్చినంత కాలం, బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం జరిగే పరిస్థితుల్లో స్త్రీలు రక్తం ఇవ్వకూడదు.
– టీకాలు వేసుకున్న రెండు వారాల లోపు ఇవ్వకూడదు.
– జంతువుల కాట్లకు గురైన ఏడాది లోపు ఇవ్వకూడదు.
– టిటానస్ (ధనుర్వాతం), డిప్తీరియా (కంఠవాపు), గ్యాస్ గ్యాంగ్రీన్ కోసం మందులు వాడినవారు, ఆఖరి మోతాదు (డోస్) మందులు వాడిన నాలుగునెలల వరకు రక్తం ఇవ్వకూడదు. ఆ తర్వాత రక్తదానం చెయ్యవచ్చు.
– గడచిన ఏడాది కాలంలోపు పచ్చకామెర్లు వ్యాధి ఉన్నవారు రక్తదానం చేయకూడదు.
– డాక్టర్ ఎం.వి. రమణయ్య
అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక
ఆంధ్రప్రదేశ్ కమిటీ