11న పొదిలిలో జగన్ పర్యటన : బూచేపల్లి
పొదిలి (ప్రకాశం జిల్లా) : టీడీపీ ఓ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఆరోపించారు. ఈ నెల 11న పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా దర్శి రోడ్లో ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ వద్ద శాసన మండలి సభ్యులు రఘురాంతో కలిసి శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. రైతులను ఆదుకునేది వైసీపీ ప్రభుత్వమేనని, పొగాకు, మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులకు న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మిర్చిని క్వింటా రూ. 24,000 కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం మిర్చిని అడిగే వారే లేరన్నారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా టీడీపీ కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టుగా కూడా లేదని అన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల సమస్యలను కండ్లారా చూసేందుకు జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు వస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
రైతుల సమస్యలను పట్టించుకోనిరాష్ట్ర ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -