ప్రజల హక్కుల కోసం జీవితం అంకితం
ఆయనకు ఏఐఎడబ్ల్యూయూ ఘన నివాళి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజల హక్కుల కోసం జీవితాన్నే అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి వీఎస్ అచ్యుతానందన్ అని నేతలు కొనియాడారు. ఆయన మొదటి వర్థంతి సందర్భంగా మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఏఐఎడబ్ల్యూయూ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వీఎస్. అచ్యుతానందన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, లౌకిక విలువల పరిరక్షణ కోసం అనేక ప్రజానుకూల చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా అధికార దుర్వినియోగం, అవినీతి, కార్పొరేట్ దోపిడీ, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించారని కొనియాడారు. శ్రమజీవుల హక్కులు, భూమి హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధన్యజీవిగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎడబ్ల్యూయూ నేతలు బి.వెంకట్, విక్రమ్ సింగ్. టి.బాబుమోహన్, సాహిల్, ఏఐకేఎస్ నేతలు విజ్జూ కృష్ణన్, పి.కృష్ణ ప్రసాద్, సీఐటీయూ నేతలు ఎం.సాయిబాబు, కెఎన్ ఉమేష్, డీవైఎఫ్ఐ నాయకుడు సంజీవ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నేత అబ్దుల్ వహాబ్, గోపిక కె.బాబు నివాళులర్పించారు.
మహోన్నతమైన వ్యక్తి అచ్యుతానందన్
- Advertisement -
- Advertisement -



