20న నోటిఫికేషన్ విడుదల బహిరంగ వేలం వేస్తాం : హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ఫ్లాట్లను బహిరంగ వేలం వేయాలని హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయించాయి. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్లు ఇచ్చిన ప్రతిపాదనలను వనరుల సమీకరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 20న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తయిన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లతో పాటు, ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు. వాటితోపాటు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని నాలుగు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తారు. ఎలాంటి వివాదాలు లేని భూములు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్మెంట్లు-ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణ సంస్థ కమిషనర్ వీసీ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. ఈ విక్రయాలతో వచ్చిన ఆదాయంతో, ఓఆర్ఆర్ పరిసరాలు, ఇతర జిల్లాల్లో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ పథకాలను చేపట్టాలని భావిస్తున్నారు. రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో (ఒక్కోదానిలో దాదాపు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉన్న టవర్ను యూనిట్గా) ఏక మొత్తంగా విక్రయిస్తారు. బిల్డర్లు, ఒక గ్రూప్గా ఏర్పడి కొనుగోలు చేయాలనుకున్న వారితో పాటు, హౌసింగ్ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల అవసరం ఉన్న సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుకల్పిస్తారు.
రాజీవ్ స్వగృహ వేలం వివరాలు
రాజీవ్ స్వగృహకు చెందిన ఇండ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్గూడలో 20, చందానగర్లో 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తి అయిన ఫ్లాట్లు, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా గాజులరామారంలోని 5 టవర్లలోని పూర్తి కాని కట్టడాలు, పోచారంలో పూర్తి అయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్పల్లిలోని 69 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి.
మహబూబ్నగర్లో…
మహబూబ్నగర్ జిల్లాలోని పోతులమడుగులో 111 , అమిస్తపూర్లో 45 ఓపెన్ప్లాట్లను విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఖమ్మంలో…
ఖమ్మం జిల్లా పోలేపల్లిలో అసంపూర్తిగా ఉన్న 8 టవర్లతో పాటు, 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తారు.
హౌసింగ్ బోర్డు స్థలాలు
కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ (కేపీహెచ్బీ)- 4వ ఫేజ్లో ఖాళీగా ఉన్న 7 ఎకరాల 33 గుంటల విస్తీర్ణంలోని ఖాళీ భూములు, అదే కాలనీలోని రెండు ఓపెన్ ప్లాట్లు (4,598 చదరపు గజాల విస్తీర్ణం, 2,420 చదరపు గజాల విస్తీర్ణం) ఈ-ఆక్షన్ ద్వారా విక్రయి స్తారు. నాంపల్లిలో 1,148 చదరపు అడుగుల విస్తీర్ణం లోని ఖాళీ స్థలం, సంజీవరెడ్డినగర్లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీహాల్కు చెందిన 2,605 చదరపు గజాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంజీవరెడ్డినగర్లోని కమ్యూనిటీహాల్ (సెల్లార్, స్టిల్ట్, జీ ప్లస్1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణంలోని 37,070 చదరపు అడు గుల పార్కింగ్ స్థలంతో పూర్తి అయ్యే స్థితిలో ఉంది. ఈ భూములను ఫంక్షన్హాల్ నిర్వహణ కోసమే వేలం వేయనున్నారు.
రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డుఫ్లాట్లు, స్థలాలు వేలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES