Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ది ముమ్మాటికీ దుష్ప్రచారమే

కాంగ్రెస్‌ది ముమ్మాటికీ దుష్ప్రచారమే

- Advertisement -

– దాన్ని తిప్పికొడతాం : కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
– కమిషన్‌ విచారణకు హాజరవుతామని వెల్లడి
– తాటాకు చప్పుళ్లకు భయపడం
– ఆనాడు తుమ్మల కూడా సంతకం పెట్టారు
– బనకచర్లపై ఎందుకు మాట్లాడటం లేదు కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు సూటి ప్రశ్న
– ఎన్డీఎస్‌ఏ అనేది ఎన్డీఏ జేబు సంస్థ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్‌ దుష్ప్రచారానికి పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. దాన్ని తిప్పికొడ తామని వ్యాఖ్యానించారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరవుతామని, కాంగ్రెస్‌ తాటాకు చప్పుళ్లకు భయపడబో మని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలపై హరీశ్‌రావు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మేడిగడ్డ బ్యారేజ్‌లో 86 పిల్లర్లలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలినట్టుగా కాంగ్రెస్‌ నేతలు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఎస్‌ఏ తన నివేదికలో పేర్కొన్నట్టు బ్యారాజ్‌కు మరమ్మతులు చేసి వినియోగంలో కి తీసుకురావాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ద్వారా మొత్తం 20,33,572 ఎకరాలకు సాగునీరం దిస్తే, ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల జీవధార అయిన కాళేశ్వరంపై నిజానిజాలను ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. తద్వా రా కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతలు బట్టకాల్చి మీదేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యమని విమర్శిం చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులపైనా, గోదావరిపై ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు కట్టడం ద్వారా తెలంగాణకు జరిగే నష్టంపై నా కూడా త్వరలోనే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచర్ల వద్ద 150 టీఎంసీ సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నదని గుర్తు చేశారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు సైతం నోరు విప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని హరీశ్‌ ఈ సందర్భంగా విమర్శించారు. 50 వేల ఎకరాలు మాత్రమే సాగయి ందంటూ మంత్రి ఉత్తమ్‌కుమార ్‌రెడ్డి చెప్తున్నారని గుర్తు చేశారు. ఇంకో కాంగ్రెస్‌ నాయకుడేమో లక్ష ఎకరాలే పారిందంటున్నారనీ, ఇలా ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు, ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 2014 ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనే ఉన్నదని, మరి అప్పుడు ఇంత పంట ఎందుకు పండలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించా మని తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కషి చేయలేదని అన్నారు. సీబీఐ, ఈడీ తరహాలో ఎన్డీఎస్‌ఏ కూడా ఇప్పుడు ఎన్డీఏ జేబు సంస్థగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంపై గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయటంతోపాటు సీడబ్ల్యూసీ పలు సూచనలు చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయా లను అన్వేషించాల్సి వచ్చిందని హరీశ్‌ చెప్పారు. ఈ క్రమంలో తన నేతృత్వంలో అప్పటి మంత్రులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులు గా సీఎం కేసీఆర్‌ క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారని గుర్తించారు. అదే విధంగా విశ్రాంత ఇంజినీర్లతో ఒక కమిటీని, ఇరిగేషన్‌శాఖ టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు. అనంతరం ప్రాజెక్టును రీ డిజైన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా నీటి లభ్యతకు పూర్తి భరోసాగా మేడిగడ్డ ఉన్నదంటూ టెక్నికల్‌ కమిటీ సూచించిందని వివరించారు. దీన్ని రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ కూడా అంగీకరించిందని చెప్పారు. అయితే బొగ్గు గనులు, పట్టణాలు, అటవీ ప్రాంతం నేపథ్యంలో మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు జలాలను తరలించలేమని రిటైర్డ్‌ ఇంజినీర్లు తెలిపారని వివరించారు. అందువల్ల గోదావరి ద్వారా జలాలను ఎల్లంపల్లి వరకు తరలించేందుకు నిర్ణయించామని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రిపోర్టులపై చర్చించి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాలంటూ సబ్‌కమిటీ ప్రభుత్వానికి నివేదికనిచ్చిందని తెలిపారు. దానిపై ఆనాడు సబ్‌ కమిటీ సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంతకం పెట్టారని హరీశ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -