Monday, June 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆస్తమా రోగులకు చేపమందు

ఆస్తమా రోగులకు చేపమందు

- Advertisement -

– 13 కౌంటర్ల ద్వారా పంపిణీ రెండ్రోజుల పాటు అందజేత
– 170 ఏండ్లుగా చేప మందు పంపిణీ
– లైన్‌లో గుండెపోటుతో మెదక్‌ జిల్లావాసి మృతి
– బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డు కోసం సిఫారసు : మంత్రి పొన్నం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌/సిటీబ్యూరో

ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉచితంగా సరఫరా చేసే చేప మందు పంపిణీ హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఆదివారం ప్రారంభమైంది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌యాదవ్‌, ఫిషరీష్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌, కార్పొరేటర్‌ రాకేష్‌ జైస్వాల్‌, బత్తిని అమర్నాథ్‌గౌడ్‌, బత్తిని కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. చేప మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి 42 లైన్లను ఏర్పాటు చేశారు. 13 కౌంటర్ల ద్వారా చేప మందు పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్‌ శాఖ లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ 140 స్పెషల్‌ బస్సులను 14 డిపోల నుంచి నడుపుతోంది. కాచిగూడ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ నుంచి బస్సులను సిద్ధంగా ఉంచింది. కాగా, లైన్‌లో గుండెపోటుతో మెదక్‌ జిల్లాకు చెందిన వృద్ధుడు మృతిచెందాడు.
ప్రపంచవ్యాప్త గుర్తింపునకు సహకరిస్తాం : మహేశ్‌ కుమార్‌గౌడ్‌
చేప మందు ప్రసాదాన్ని తాను 1995 నుంచి తీసుకుంటున్నానని, తన భార్య ఢిల్టీ నుంచి వచ్చి ఈ చేప ప్రసాదం తీసుకుంటున్నారని, బత్తిని కుటుంబం తన భార్య బంధువులు అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. నేచురల్‌ ఔషధాలతో కూడిన మందు అని తెలిపారు. ఈ చేప ముందుకు దాదాపు 170 ఏండ్ల చరిత్ర ఉందని, ఇది ప్రజల విశ్వాసంతో కూడిన మందు అన్నారు. లక్షల మందికి జబ్బు నయం అవడం సంతోషకరమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉబ్బసం రోగులు వస్తున్నారని తెలిపారు. చేప మందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డు వచ్చేలా సహకరిస్తామని రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. రానున్న రాజ్యసభ సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తనున్నట్టు చెప్పారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ.. బత్తిని కుటుంబ సభ్యులు నిస్వార్ధ సేవ చేస్తున్నారన్నారు. ఫార్మాసిటికల్‌ కంపెనీస్‌ దుష్ప్రచారం చేసినా.. బత్తిని హరినాథ్‌గౌడ్‌ వెనుకడుగు వేయలేదన్నారు. బత్తిని కుటుంబ సభ్యులను ప్రభుత్వం గుర్తించి అత్యంత విలువైన పురస్కారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఫిషరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమయ్యే చేపలను ఫిషరీ శాఖ తరపున అందుబాటులో ఉంచామని తెలిపారు.
మెదక్‌ జిల్లావాసి మృతి
మెదక్‌ జిల్లాకు చెందిన సత్యనారాయణ(75) లైన్‌లో స్పృహ తప్పి పడిపోయారు. ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్‌ చేసినప్పటికీ వృద్ద్ధుడి ప్రాణం దక్కలేదు. గుండెపోటు వల్ల మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి మార్చారు.
బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డు
కోసం సిఫారసు : మంత్రి పొన్నం
బత్తిని కుటుంబం 170 ఏండ్లుగా చేప మందును లక్షలాది మంది ఉబ్బసం రోగులకు అందించడం గర్వించదగ్గ విషయమని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ చేప మందును స్వీకరించేందుకు వస్తుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల నుంచే అన్ని రకాల చర్యలు తీసుకుంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మృగశిర కార్తె రోజు చేప మందు తినడం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని చాలా మంది నమ్మకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బత్తిని కుటుంబానికి పద్మశ్రీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్సు చేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -