నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తర మలేసియాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థులతో క్యాంపస్కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక మినీవ్యాన్ను ఢీకొట్టింది. దీంతో బస్సు సిబ్బంది సహా 15 మంది మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. థాయ్లాండ్ సరిహద్దు సమీపంలోని ఈస్ట్-వెస్ట్ హైవేపై గెరిక్ పట్టణం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. మలేసియాలో గత పదేళ్లలో ఇదే అత్యంత ఘోరమైన ప్రమాదమని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులేనని చెప్పారు. బస్సు అదుపుతప్పి మినీవ్యాన్ ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆకుపచ్చ రంగు బస్సు కుడివైపునకు బోల్తాపడి వెనుక భాగం నుజ్జునుజ్జు కాగా, ఎరుపు రంగు మినీవ్యాన్ రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. “కొంతమంది బాధితులు స్వయంగా బయటపడగా, మరికొందరు బయటకు విసిరివేయబడ్డారు. ఇంకొందరు బస్సులోనే చిక్కుకుపోయారు” అని చెప్పారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు హైడ్రాలిక్ కట్టర్ను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు. మృతుల్లో సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి చెందిన 14 మంది విద్యార్థులతో పాటు బస్సు అటెండెంట్ ఉన్నారని అత్యవసర సేవల విభాగం ధృవీకరించింది. గాయపడిన 33 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
బస్సు, వ్యాన్ ఢీ.. 15 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES