– ఎస్బిఐ బ్యాంకు ముందు నిరసన,ధర్నా ..
నవతెలంగాణ – వేములవాడ
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు వేములవాడ పట్టణంలోని ఎస్బిఐ శాఖ ముందు మహాధర్నా కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల బీజేపీ యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధం విధించిందని అన్నారు. ఈ పథకం ద్వారా స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలపై పూర్తి సమాచారాన్ని మార్చి 6 లోపు బహిరంగపరచాలని,ఎన్నికల కమిషన్కు సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని కోర్టు ఆదేశించిందని కానీ దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం దాతల గురించిన సమాచారం పబ్లిక్గా ఇస్తే,కార్పొరేట్లతో తన సంబంధాలను బహిర్గతం అవుతుందని భయపడుతుందన్నారు.
బీజేపీ ఆందోళన చెందుతూ ఎలక్టోరల్ బాండ్ సమాచారాన్ని పంచుకోవద్దని మోడీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఒత్తిడి తెస్తూ పెత్తనం చెలయిస్తోందని విమర్శించారు. కోర్టు నిర్ణయంతో ఎన్నికల్లో నల్లధనానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యగా ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి అన్నారు. ఎలక్టోరల్ బాండ్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి బీజేపీ పార్టీ ఒక్కటే 26,566.11 కోట్లను అందుకుంది. ఇది మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో 55% ఉందన్నారు. ఎలక్టోరల్ బాండ్ వివరాలను పంచుకోవడానికి జూన్ వరకు పొడిగించాలని కోరుతూ ఎస్బిఐతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేయించిందన్నారు. బీజేపీ ఆర్థిక అవకతవకలను, నల్లధనం మూలాన్ని దాచిపెట్టేందుకు ఎస్బీఐని బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జడ్పిటిసి నాగం కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ , పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, కౌన్సిలర్లు ఇప్పప్పుల అజయ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పాత సత్యలక్ష్మి, చిలుక రమేష్, తూo మధు, పుల్కం రాజు, ఎండి రజాక్, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.