నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలోని ఇందర్లోక్ ప్రాంతంలో శుక్రవారం నమాజ్ చేస్తున్న ముస్లిం యువకులను పోలీసు అధికారి కాలితో తన్నటం అత్యంత హేయమైన చర్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్రాజా విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దురహంకారంగా ప్రవర్తించిన పోలిస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మసీదు బయట నమాజ్ చేయడం సాధారణ విషయమేనని తెలిపారు. ఈ కారణంతో ముస్లిం యువకులను ఓ పోలీసు అధికారి కాలితో తన్ని లేపి అవమానకరంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. మతోన్మాద బీజేపీ పాలనలో పోలిస్ యంత్రాంగంలో నిండిన విద్వేషానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఏ మతానికి చెందిన వారైనా పండుగలు, ఉత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో రోడ్డుపై గుమిగూడటం సహజమని పేర్కొన్నారు. కనీస మానవత్వం ఉన్న వారు ఎవరూ అలా చేయరని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్బుద్ది ఇలాంటి చర్యలకు ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.