నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ -ఎన్డీయే ప్రభుత్వం మూడో దఫా పాలన తొలి ఏడాది పూర్తి చేసుకుంది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒకే ప్రధాని వరుసగా మూడుసార్లు ఎన్నిక కావడం అసాధారణమని ముందు నుంచి మోత మోగిస్తూనే వున్నారు. ఇందిరాగాంధీ తర్వాత ‘ఉక్కు ప్రధాని’ మోడీయేనని చెబుతూనే మరోవైపున ఆమెతో పాటు నెహ్రూను కూడా పక్కనపెట్టి ఈయననే ఊరేగించే భారీ పథకం నడుస్తూనే వుంది. నెహ్రూ హయాంలో తప్పొప్పులు ఏమున్నా నవభారత నిర్మాణానికి స్వావలంబనకు అలీన విధానానికి పునాదులు పడ్డాయనేది నిర్వివాదంశం. ఇందిరాగాంధీ ఏకపక్ష ధోరణి ఎమర్జెన్సీతో పరాకాష్టకు చేరడం వాస్తవమే అయిన ప్పటికీ దేశాన్ని స్వావలంబనతో నిలబెట్టడంలో ఆమెపాత్ర కాదనలేనిది. ఆ కాలంలో భారతదేశ అంతర్జాతీయ ప్రతిష్ట కూడా సమున్నతంగా ఉండేది. అందుకే మొన్న పాకిస్తాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడి అస్పష్ట పాత్రతో కాల్పుల విరమణ జరిగిందన్న సమాచారం భారతీయులు జీర్ణం చేసుకోలేకపోయారు. దీనిపై పూర్తి వాస్తవాలు చెప్పేందుకు, ప్రత్యేక పార్లమెంట్ నిర్వహిం చడానికి మోడీ సర్కార్ సిద్ధం వెనకాడుతున్నది. అయినా ఆయన విశ్వగురు అని, ప్రపంచాన్ని లోబర్చుకున్నారని ప్రచార ఆర్భాటం మాత్రం ప్రహసనప్రాయంగా సాగుతున్నది. ఎన్డీయే భాగస్వాములుుగా, కీలక మద్దతుదార్లుగా ఉన్నందువల్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా ఈ ప్రచారానికే వంతపాడుతున్నారు. పాలస్తీనా గాజా ప్రాంతంపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమంతో పాటు ఇరాన్పై ఘోరమైన దాడికి పాల్పడుతున్నా ప్రశ్నించగల సత్తా మనకు లేకుండా పోయింది.మోడీకి ప్రపంచ పలుకుబడి గురించి పరవశించి చెప్పుకోవడమేగానీ ఆ దాడి నడిపిస్తున్న యూదు జాత్యహంకార నేత నెతన్యాహూ ఫోన్చేస్తే మోడీ గట్టిగా శాంతికాంక్షను చెప్పలేకపోయారు. అయినా సరే మోడీ విశ్వగురువేనని నమ్మబలుకుతున్నారు.
విచిత్ర భాష్యాలు
నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారతదేశం మోడీ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నది కనుక అమెరికా హడలిపోతున్నదని విచిత్ర భాష్యాలు వినిపిస్తున్నారు. ఇరుగుపొరుగు దేశాలతోనూ, దక్షిణాసియా దేశాలతోనూ సంభాషణలు జరుపుకుండా, సుదూర దేశాలకు ఆలస్యంగా అఖిలపక్ష బందాలను పంపించి దౌత్య విజయాలు సాధించామని వేడుకలు చేసుకుంటున్నారు. సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ భారత దేశంతో నిర్మాణాత్మకమైన సాధారణ సంబంధాలు పెంచుకోవడానికి సంసిద్ధం అంటున్నది చైనా మాత్రమే. దాన్నే ప్రధాన శత్రువుగా చూపించేందుకు సంఘపరివార్ చేసిన ప్రయత్నాలు. అమెరికా ఎగదోతలు విఫలమై ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆ దేశానికి వెళ్తున్న పరిస్థితి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా భారత దేశంలో కండ్లముందు జరుగుతున్న తలకిందుల వ్యవహారంలో భాగమేనని ఇట్టే అర్థమవుతుంది. భారతదేశ జీడీపీ ఎప్పుడో 2025-26 తర్వాత జపాన్ కన్నా అతి కొద్దిగా పెరుగుదల చూపించే అవకాశం ఉంది అని ఐఎంఎఫ్ చెప్పింది కనుక ముందే కూసిన కోయిలల్లా ఇప్పటినుంచే సంబరాలు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. భారత దేశంలో బడామీడియా మోడీయాగా లేక గోడి మీడియాగా మారిపోయి భజన కీర్తన లు ఆలపించడం అలవాటైందే. కానీ ఈ మూడోదఫా ముచ్చటలో దాని తీరు మరీ తమాషాగా ఉన్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల హడావుడి కుప్పకూలి మోడీ మైనార్టీలో పడిపోయారనే వాస్తవాన్ని ఇప్పటికీ ఈ మీడియా జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే అక్కడి నుంచే నరుక్కుని రావాలన్నట్టుగా ఇప్పుడు ప్రచారాలు ఎత్తుకున్నది.
లోటు భర్తీనా? తీవ్రమా?
ఉదాహరణకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మొన్న మొదటి పేజీలో మోడీ 3.0 ప్రభుత్వం పరిస్థితులకు తగినట్టు మారిందని ముందుకు పోతోందని బాక్స్ కథనం ప్రచురించింది. బీజేపీ దేశంలో పున:శక్తివంతం కావటం, మరింతగా నిలదొక్కుకోవడం జరుగుతుందంటూ ఆ కథనం మొదలైంది. 2024 ఎన్నికల్లో మోడీ మొదటిసారిగా మిశ్రమ ప్రభుత్వ నేతగా ముందుకు వచ్చారట. వాస్తవానికి బీజేపీకి మాత్రమే మెజార్టీ ఉన్నప్పటికీ గత రెండుసార్లు కూడా ఆయన ఇతర పార్టీల భాగస్వామ్యంతోనే అధికారంలోకి వచ్చారు. మెజారిటీ రాకపోవడం వల్ల మరింత ఏకాభిప్రాయ పూర్వకమైన సంప్రదింపుల ప్రక్రియతో పాలించవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఈ కథనం చెబుతున్నది. ఎన్డీయేలో విభిన్న భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలకు చోటు కల్పించేందుకు ఒక కొత్త రాజకీయ ప్రక్రియను రూపొందించుకోవాల్సి వచ్చిందట. అయితే స్వల్ప కాలంలోనే రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో విజయాలు సాధించడం ద్వారా బీజేపీ తన ఆధిపత్యాన్ని తిరిగి నెల కలుపుకోగలిగిందని ఈ పత్రికతో సహా దాదాపు అన్ని జాతీయ పత్రికల్లోనూ ఒకే తరహా వాదన ముందుకు తీసుకురావడం వ్యూహాత్మక ప్రచార ఆయుధంగా స్పష్టమవుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ కోల్పోయాక శాసనసభల ఫలితాలతో మళ్లీ పుంజుకోగలిగిందని, పోయింది రాబట్టుకోగలిగిందని ఇవి చెప్తున్నాయి. కానీ తీసుకున్న కొలబద్దలు వేరుగా వున్నాయి. హర్యానాలో లోక్సభకు సగం అంటే ఐదు స్థానాలు మాత్రమే తెచ్చుకోగా శాసనసభలో 90కి 48 తెచ్చుకోవటం గొప్పగా చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఓట్ల శాతం మాత్రం గత శాసనసభ ఎన్నికలతో పోలు స్తున్నారు. ఇదే తరహాలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిషా శాసనసభల విజయాలను కూడా చూపిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో చాలాచోట్ల కాంగ్రెస్ ఇతర లౌకిక పార్టీలు సర్దుబాట్లు చేసుకోకపోవడంతో ఓట్ల చీలిక వల్ల బీజేపీ గెలవగలిగింది. అలా చూస్తే ఓట్ల శాతంలో పెద్ద తేడా ఉండదు కనుక గత శాసనసభతో పోల్చి లెక్కలు చూపిస్తున్నారు. ఆఖరికి బీజేపీ ఓడిపోయిన జమ్మూ కాశ్మీర్లో కూడా ఓట్ల శాతం పెరుగుదలను పెంచి చూపిస్తున్నది మీడియా. జార్ఖండ్లో ఓడిపోవడమే గాక 2024తో పోలిస్తే 14 శాతం ఓట్లు తగ్గాయి. కానీ గత శాసనసభ తో పోల్చి 0.19శాతం మాత్రమే తగ్గినట్టు చెప్తున్నది. మొత్తమ్మీద చూస్తే జార్ఖండ్ మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ కోలుకుందని చెప్పడం ఈ విశ్లేషణల వ్యూహం. పైగా దీన్ని మరో విధంగా తక్కువ ఓట్లతోనే ఎక్కువ సీట్లు తెచ్చుకోగల బీజేపీ ప్రజ్ఞగా చిత్రిస్తున్నది.
ఏకాదశ సూత్రాల తమాషా
చాలా ఇంగ్లీష్ పత్రికల్లో స్పాన్సర్డ్గా కనిపించే ‘స్వరాజ్య’ సంపాదకుడు ఆర్ జగన్నాథన్ మోడీ పద కొండేండ్లలో 11 మార్పులు అని ఓ జాబితా ఇస్తూ తికమక పర్చే వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ హయాంలో కూడా కాంగ్రెస్ రాష్ట్రాల స్థాయిలో హిందూ పార్టీగా ఉండేదని, ముస్లింలను ఆదుకుంటూ మద్దతు పొందేదని మోడీ కూడా అదేవిధంగా అనుసరిస్తున్నాడని ఈయన చెబుతున్నారు. మోడీ ఘనత దేశంలో మతపరమైన అస్తిత్వాన్ని నెలకొల్పడమేనని, మైనార్టీలు ప్రతిపక్షం వైపు మొగ్గకుండా చూశారని చెప్తున్నారు. అంతేకాదు, వక్ఫ్ బిల్లు ద్వారా బీజేపీ తాను హిందుత్వ విధానాలకే కట్టుబడి ఉన్నట్టుగా, మైనార్టీలు ఈ మార్గానికి రాక తప్పదని సంకేతాలు ఇవ్వడం మరో ప్రత్యేకత. జగన్నాథన్ చెబుతున్న మూడో లక్షణం మరింతగా చెప్పుకోవలసింది. దేశంలోనే మొదటిసారిగా బీజేపీ ఒక రాజకీయపార్టీని కార్పొరేట్ పద్ధతిలో నడపవచ్చునని అగ్ర నాయకుడు సీఈఓ లాగా ఉంటే కార్యకర్తలు ఉద్యోగులుగా, సామాన్య ప్రజలు సభ్యులుగా కనిపిస్తున్నారని ఏదేదో వర్ణించారు. పైనుంచి కిందకు ప్రమోషన్లతో వినియోగ సరుకుల(ఎఫ్ఎం సిజి) తరహాలో రాజకీయం నడపవచ్చునని అర్థమైందట. మోడీ దెబ్బకు భయపడటం వలనే అన్ని పార్టీలు ఉచితాల కోసం సిద్ధమైపోయాయట. రాజకీయ ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక సంస్కరణలను, కార్పొరేట్ తరహా నిర్ణయాలను ఆయన ఎలాగో కొన సాగించగలిగారట.కానీ ధనిక రైతుల ఆందోళన వల్ల వ్యవసాయ రంగంలో చేయలేకపోయారట. పైన మోడీ అతి బలమైన నాయకుడుగా ఉన్నప్పటికీ రాష్ట్రాలలో యోగి,పడ్నవీస్, హిమంతా బిశ్వాస్ వంటి బలమైన నాయ కులు ఓట్లు పొందే పరిస్థితి కనిపిస్తుందట. తమిళనాడులో అన్నామలై కూడా ఈ కోవలోకొస్తాడట. ఈయన చెప్పే ఏడో అంశం జాతీయవాదాన్ని రాజకీయాల్లో మోడీ బలమైన అంశంగా ప్రవేశ పెట్టగలిగారట. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) చాలా శక్తివంతంగా తయారైందట. ఈ కారణంగా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించలేక పోయినా ఆరెస్సెస్నఉ ఉపయోగించుకొని మళ్లీ పుంజుకుంటున్నదట. మోడీ, అమిత్ షా ల రూపంలో ఒకరికి ఇద్దరు నాయకులు ఉండటం చాలా ఉపయోగ కరంగా తేలిపోయిందట. ఈ ద్వయాన్ని ఆయన నెహ్రూ పటేల్. వాజ్పేయి, అద్వానీ, మన్మోహన్, సోనియా గాంధీలతో పోలుస్తున్నాడు. ఉచితాలు పెరిగి పోవటంతో ప్రభుత్వాలు వ్యాపార వర్గాలకుఅనుకూలమైన సంస్కరణలను చేయడం, చట్టాలు తేవడం కష్టంగా మారిందట. మోడీ సర్కారుకు అనుకూలంగా పది అంశాలు చెప్పిన జగన్నాథన్ చావు కబురు చల్లగా చెప్పినట్టు అసలు విషయం ఆఖరులో సెలవిస్తున్నాడు. ఉద్యోగాల కల్పన అనే అతి ప్రధానమైన జాతీయ సవాలు మోడీ పాలనలో అలాగే ఉండిపోయిందని ఒప్పుకోవడం కొసమెరుపు.ఒకే పార్టీ ప్రాబల్యం ఉండటం వల్ల రాజకీయ ఏకాభిప్రాయం అన్నది అసాధ్యంగా మారిందట.
మూల్యం తప్పదు
మోడీ పాలన అసలు సమస్య కూడా ఈ పొగడ్తల్లోనే మనకు అర్థమవుతుంది. మెజార్టీ కోల్పోయిన బీజేపీ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నది. వక్ఫ్బిల్లు వంటివి కేవలం బీజేపీ-సంఫ్ు మత రాజకీయాల మేరకే ఆమోదం పొందుతున్నాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ లాంటి విధానాలు ప్రాంతీయ పార్టీలకు పెద్ద సవాళ్లుగా పరిణమిస్తున్నాయి.ఇతరులపై ఆధారపడి నప్పటికీ సంఘపరివార్ ఒత్తిడితో బీజేపీ నాయకత్వం తన సొంత భావజాలాన్ని, రాజకీయ ప్రాధాన్యతలను దేశంపై రుద్దుతున్నదని పైరాతల్లోనే స్పష్టమవుతున్నది. కిందపడి లేచి ఇదో విన్యాసం అన్న చందంగా వందిమాగధులు చెప్పిన అంశాలన్నీ వాస్తవంగా మోడీ సర్కారు ఇరకాటానికి అద్దం పడుతున్నాయి. లౌకిక ప్రతిపక్షాలు ఏకమయితే ఎక్కడ ముప్పువస్తుందో అన్న భయంతోనే అంతా అనుకూలంగా మార్చివేయడంలో మోడీ ఘనతగా చాటుకుంటున్నారు.కానీ త్వరలో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికలతో సహా రాజకీయ సవాళ్లు, ప్రజల పోరాటాలు బీజేపీని వెన్నాడుతున్నాయి. వరుసగా వస్తున్న అంతర్జాతీయ కుదుపులు ఆర్థిక సవాళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఒక్క ఏడాదికే ఇలావుంటే మిగిలిన కాలం ఎలా వుంటుందనేది చూడవలసిందే. పైగా ఈ ఎదురుదెెబ్బల తర్వాత సంఫ్ుపరివార్ కూడా కేవలం మోడీకే అన్నీవదలివేయకుండా తన జోక్యం పెంచడం చూస్తున్నదే. జెపి నడ్డాస్థానంలో నూతన అధ్యక్షుని ఎన్నిక పూర్తిగా తమకే వదిలి వేయ వలసిందని ఆరెస్సెస్ ఆదేశించిందట. అనూహ్యమైన ఎంపిక జరిగినా ఆశ్చర్యం లేదని కీలక వ్యక్తులే చెబుతున్నారు. ఇంతగా ప్రేరేపించ బడిన మతైక జాతీయవాద ధోరణులు కూడా ప్రభావం చూపిస్తాయి.ఇటీవల మోడీ పిలుపునిచ్చిన శాశ్వత యుద్ధ సిద్ధాంతం కూడా ఆందోళనకరంగా మారుతున్నది. అందుకే ప్రజాస్వామిక శక్తులు మరింత అప్రమత్తంగా వుండకతప్పదు.రాజకీయ అవసరాల కోసం మోడీకి వంతపాడుతున్న వారు కూడా అందుకు తగు మూల్యం చెల్లించవలసి వస్తుంది.
తెలకపల్లి రవి