– కాలుష్యకారక కంపెనీలొద్దంటున్న జనం
– ఆరోగ్యం, పర్యావరణం దెబ్బ తింటుందని సర్వత్రా ఆందోళన
– దిలావర్పూర్ నుంచి దన్వాడ దాక నిరసనలు
– ప్రజాందోళనలను పట్టించుకోని ప్రభుత్వం, ప్రధాన పార్టీలు
– పోలీసుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం
పచ్చని పల్లెల్లో ఇథనాల్ మంటలు మండుతున్నాయి. అదిలాబాద్ జిల్లా దిలావర్పూర్ నుంచి జోగులాంబ జిల్లా పెద్ద దన్వాడ వరకు ప్రజలు నిరసన బాటపట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులోనూ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమైనా, నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. హిందూపూర్, ధర్మపురి, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, మక్తల్ సిద్దిపేటలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20కి పైగా ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే స్థానికులు వీటిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. చిన్న పిల్లలు, మహిళలతో పాటు గ్రామాలకు గ్రామాలే మూకుమ్మడిగా రోడ్డెక్కుతున్నాయి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. నాలుగు నెలల పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఏకంగా ఆర్డీవోను కారులోనే 8 గంటల పాటు నిర్బందించారు. పోలీసులపై ప్రజలు తిరగబడి దాడులు చేశారు. దీంతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇచ్చిన నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. చిత్తనూర్లో తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఎకలాస్పూర్, చిత్తనూర్, మక్తల్తో పాటు చుట్టు పక్క గ్రామాల ప్రజల ఆందోళనలను పోలీసులు అణిచి వేశారు. దాదాపు 100 మందికి పైగా ప్రజలపై కేసులు నమోదు చేశారు. కొంత మందిపై రౌడిషీట్ సైతం తెరిచారు. పోలీసుల లాఠీచార్జిల్లో అనేక మంది గాయపడ్డారు. ఎకలాస్పూర్కు చెందిన కటిక కాశిం అనే వ్యక్తి పోలీసుల దెబ్బలకు కోలుకోలేక ఆస్పత్రిలో చికిత్స పొంది చివరికి చనిపోయాడు. అయినా ఫ్యాక్టరీ ఏర్పాటు ఆగలేదు. గతేడాది నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించింది. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలోనూ పనులను చుట్టు పక్కల గ్రామాల ప్రజల నిరసనలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచి పోయాయి. అయినా ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని జనం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులు పరిశ్రమ ఏర్పాటుచేస్తున్న గాయత్రి కంపెనీకి చెందిన సామగ్రి, కార్లు ధ్వంసం చేయడంతోపాటు కూలీలను తరిమేశారంటూ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలి ఠాణాలో కేసు నమోదైంది. వెయ్యి మందికిపైగా ఆందోళనలో పాల్గొనగా, 45 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కేసులకు వెరవకుండా ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా భూ భారతి రెవెన్యూ సదస్సును సైతం గ్రామ రైతులు బహిష్కరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ శాంతియుత పోరాటం చేస్తున్నవారిని కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు, పోలీసులతో కలిసి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ కంపెనీల ఏర్పాటును ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఈ పోరాటంలో సామానుయలు మినహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పాల్గొనడం లేదు. కాంగ్రెస్ వీటి ఏర్పాటుపై మౌనం వహిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన స్థానిక నేతలు అక్కడక్కడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారే తప్ప వాటిని అడ్డుకునేందుకు ప్రజలతో కలిసి రావడం లేదు.
పోలీసుల తీరు….
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలంటూ స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళనలు అక్కడక్కడా హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రజలు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన చేపట్టిన సందర్భాల్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలున్నాయి. దిలావర్పూర్, చిత్తనూర్, దన్వాడ తదితర ప్రాంతాల్లో పోలీసులు ఏక పక్షంగా నిరసన కారులపైనే కేసులు పెట్టడం జరిగిందనే విమర్శలున్నాయి. శాంతియుత పోరాటం చేస్తున్నవారిపై కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు కలిసి దాడులకు పాల్పడుతున్నా వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దాడుల్లో గాయపడ్డ వారి నుంచి కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించడం లేదని తెలుస్తోంది.
దాడుల చేయడం మాకు తెలియదు
”పెద్దదాన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నా కుమారుడిని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్కు కొట్టుకుంటూ లాక్కెళ్లారు. నా కొడుకును రక్షించండంటూ కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. అయ్యా మాకు పంటలు పండించడమే తప్ప దాడులు చేయడం తెలియదు”
– బజారమ్మ.పెద్ద దన్వాడ
ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు. ఈ కంపెనీ ఏర్పాటైతే దన్వాడ గ్రామం వల్లకాడవుతది. నీరు పాడై మనుషులతో పాటు మూగ జీవాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. పచ్చని పంట పొలాలు, ప్రజల మధ్యన కాకుండా ఏ అటవీ ప్రాంతాల్లోనో కంపెనీని ఏర్పాటు చేసుకోండి. దయ చేసి మా గ్రామాన్ని వదిలి పెట్టండి.
– నారాయణ, మాజీ సర్పంచ్ చిన్నదన్వాడ
కేసులను ఎత్తివేయండి
చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రెండేండ్ల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చిత్తనూర్, ఎకలాస్పూర్, జిన్నారంతో పాటు చుట్టు పది గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. మూడు గ్రామాలకు చెందిన 98 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎనిమిది మందిపై రౌడిషీట్ ఓపెన్ చేశారు. నా భర్త రాంచంద్రయ్యను రాత్రి పూట ఇంటినుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లి రిమాండ్కు తరలించారు. నెల రోజుల పాటు జైళ్లోనే ఉన్నారు. ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా ఫ్యాక్టరీని నిర్మించి, ఇథనాల్ తయారు చేస్తున్నారు. కాని మేం మాత్రం రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎవరి కోసం? మాపై పెట్టిన కేసులను ఎత్తేయాలి.
-హన్మమ్మ, ఎకలాస్పూర్, మరికల్