Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబస్సు డ్రైవర్‌ సరితకు రవాణామంత్రి శుభాకాంక్షలు

బస్సు డ్రైవర్‌ సరితకు రవాణామంత్రి శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌ సరితకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆర్టీసీ మహిళా సాధికారత దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సహకారంతో ఆర్టీసీ జేబీఎమ్‌ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు డ్రైవర్‌గా సరితకు ఉద్యోగం ఇప్పించారని తెలిపారు. మహిళా డ్రైవర్‌ సరిత కూడా రవాణాశాఖ మంత్రికి ధన్యవాదాలు చెప్పారని వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవింగ్‌ విభాగంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సిత్య తండాకు చెందిన వీ సరిత మిర్యాలగూడ డిపోలో జేబీఎమ్‌ సంస్థ నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు మహిళా డ్రైవర్‌గా విధుల్లో చేరారనీ, ఆమె హైదరాబాద్‌ టూ మిర్యాలగూడ బస్సును నడుపుతున్నారని వివరించారు. ఆమె గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో పదేండ్లు డ్రైవర్‌గా విధులు నిర్వహించారనీ, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్‌గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి జేబీఎమ్‌ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి, తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో నియమించారని చెప్పుకొచ్చారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.
‘కారుణ్యం’ చూపండి-ఎన్‌ఎమ్‌యూ
గతంలో 55 రోజుల ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగాలు చేసిన కార్మికుల కుటుంబ సభ్యులకు వెంటనే సంస్థలో పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్‌ఎమ్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి కోరారు. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌ సరిత అని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆమె ప్రయివేటు బస్సు డ్రైవర్‌ అనీ, ఆర్టీసీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమెకు తక్షణం ఆర్టీసీలోనే పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలనీ, దానితోపాటే ప్రాణత్యాగాలు చేసిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా కారుణ్య నియామకాల ద్వారా పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

సరితకు ఆర్టీసీలో శాశ్వత డ్రైవర్‌గా ఉద్యోగం ఇవ్వాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌ డిమాండ్‌
తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్‌ అయిన సరితకు టీజీఎస్‌ఆర్టీసీలోనే పర్మినెంట్‌ డ్రైవర్‌గా ఉద్యోగం ఇచ్చి గౌరవం కల్పించాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ను రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. డ్రైవర్‌ సరితను ఆర్టీసీలో నియమించకుండా ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీ అయిన జేబీఎమ్‌ సంస్థలో, మంత్రి గారి సహకారంతో తాత్కాలిక ఉద్యోగం కల్పించి, అదేదో గొప్పపని చేసినట్టు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో సరిత పదేండ్లు డ్రైవర్‌గా పనిచేసి ప్రతిభ, సమర్ధతను నిరూపించుకున్నారనీ, ఆమెను సంస్థలో నియమిస్తే, టీజీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌ అని చెప్పుకోవచ్చన్నారు. ప్రయివేటు విద్యుత్‌బస్సు సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తే, ఆ పేరు ప్రతిష్టలు ఆ ప్రయివేటు సంస్థకే చెందుతాయి తప్ప, ఆర్టీసీకి దక్కవని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆర్టీసీ యాజమాన్యం సన్మానించి, ప్రోత్సహిస్తున్నదనీ, బస్సులో జన్మించిన పిల్లలకు లైఫ్‌ టైమ్‌ ఉచిత బస్‌ పాస్‌ వంటివి ఇస్తూ గౌరవిస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి పేరుప్రతిష్టలు ఉన్న సంస్థలో సరితకు పర్మినెంట్‌ డ్రైవర్‌గా ఉద్యోగం ఇస్తే, ఆ గౌరవం ఆర్టీసీకే దక్కుతుందని తెలిపారు. దానికోసం అవసరమైతే నిబంధనలు సడలించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -