– విదేశీ కంపెనీకి డబ్బులు పంపడంపై కేటీఆర్కు ఏసీబీ సూటి ప్రశ్న
– 18లోగా సెల్ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేయాలని ఆదేశం
– అవే ప్రశ్నలు తిప్పితిప్పి అడిగారు : కేటీఆర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొం టున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సోమవారం ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. కార్ రేసింగ్ నిర్వహణకు సంబంధించి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని విదేశీ కంపెనీ ఎప్ఈవోకూ పంపించే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ప్రయివేట్ కంపెనీతో ఫార్ములా ఈ కార్ రేసింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. రేస్ నిర్వహణలో ప్రయివేట్ కంపెనీతో సివిల్ వర్క్ మాత్రమే నిర్వహిస్తామని ఒప్పందం కుదుర్చుకుని ఎందుకు కార్ రేసింగ్లో పాల్గొన్నారని ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్ , డీఎస్పీ మాజీద్ఖాన్లు కేటీఆర్ను విచారించారు. మొదటి సారీ విచారణకు హాజరైన సందర్భంగా ఇచ్చిన సమాధానాలనే కేటీఆర్ తిరిగి ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచడానికి రేస్ నిర్వహించామనీ, ఇందులో తాను చేసిన తప్పేవిూ లేదని కేటీఆర్ ఏసీబీ అధికారులకు సమాధానమిచ్చినట్టు తెలిసింది. హెచ్ఎండీఏ నుంచి నిధులను విదేశీ కంపెనీలకు చెల్లించాలని అక్కడి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారా అనే ప్రశ్నకు, అవసరమైన మేరకు ఆదేశాలిచ్చానని కేటీఆర్ జవాబిచ్చినట్టు తెలిసింది. ఆర్బీఐ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదనే ప్రశ్నకు స్పందిస్తూ అది అధికారులు చూసుకునే ప్రక్రియని అన్నట్టు సమాచారం. ఫార్ములా కార్ రేసింగ్ మొదటి దశ నుంచి ఒక ప్రయివేట్ కంపెనీ ఎందుకు తప్పుకుందని అడగగా, అది వారి నిర్ణయమని చెప్పినట్టు తెలిసింది. రెందోదశ కార్ రేస్ నిర్ణయం వెనుక ఇక్కడి వ్యాపారులకు, ప్రభుత్వానికి వచ్చే లాభాలే కారణమని తెలిపినట్టు తెలిసింది. తాను ఈ కార్ రేస్ నిర్వహణపై తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని పదేపదే కేటీఆర్ అన్నట్టు సమాచారం. 2021 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన రెండు సెల్ఫోను,్ల ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లను ఈ నెల 18లోగా తమకు అందజేయాలని అధికారులు కేటీఆర్ను ఆదేశించారు. కాగా విచారణ కోసం బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చే సందర్భంగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఆ ప్రాంతానికి చేరుకుని మద్దతుగా నినాదాలు చేశాయి. వారిని అతి కష్టం మీద పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.
తిప్పితిప్పి అవే ప్రశ్నలు: కేటీఆర్
విచారణలో ఏసీబీ అధికారులు తిప్పితిప్పి అవే ప్రశ్నలు వేసినట్టు కేటీఆర్ తెలిపారు. విచారణ అనంతరం ఆయన తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. విచారణలో ఏసీబీ అధికారులు వేసిన ప్రశ్నలే వేస్తూ తన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేదని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి కేవలం కక్ష సాధింపుతోనే తనను జైలుకు పంపించాలని కుట్రతో ఇలాంటి కేసులను బనాయించారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపించినా భయపడే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు. తమ వెంట తెలంగాణ ప్రజలున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంటూ వరుస పెట్టి కేసులు పెట్టి తమను ఇబ్బందుల పాలు చేయడమే రేవత్ లక్ష్యమని ఆరోపించారు.
ఆర్బీఐ నుంచి అనుమతి ఎందుకు తీసుకోలేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES