Tuesday, June 17, 2025
E-PAPER
Homeజాతీయంఅహ్మదాబాద్‌ ఘటనపై ప్రస్తుత దర్యాప్తును ఆపొద్దు

అహ్మదాబాద్‌ ఘటనపై ప్రస్తుత దర్యాప్తును ఆపొద్దు

- Advertisement -

– సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ:
అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా 171 విమానం కూలిపోయిన విషాద ఘటనకు సంబం ధించి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఓ) రూపొందించిన అంతర్జాతీయ ప్రొటోకాల్స్‌, నిబంధనల ప్రకారం భారత్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) తన స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. విమానం కూలిపోవడానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులపై విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా, ఏఏఐబీ, విమానం బ్లాక్‌ బాక్స్‌లను, ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకోనుంది. సంబంధిత అంతర్జాతీయ సంస్థలు, విమానం, ఇంజన్‌ తయారీదారులు, ఇతర పక్షాల సహకారంతో తన దర్యాప్తులను పూర్తి చేయనుంది. ఈలోగా ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. ఏఏఐబీ ఏ లక్ష్యాలనైతే పేర్కొందో దాదాపుగా అవే లక్ష్యాలతో అంటే ప్రమాదానికి మూల కారణాన్ని నిర్ధారించడం కోసం హోం కార్యదర్శి అధ్యక్షతన భారత ప్రభుత్వం ‘ఉన్నత స్థాయి కమిటీ’ (హెచ్‌ఎల్‌సీ)ని ఏర్పాటు చేసింది. బ్లాక్‌ బాక్స్‌లను స్వాధీనపరుచుకోవడం, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరపడం వంటి ఈ కమిటీ ఇతర లక్ష్యాలు కూడా దాదాపుగా అలాగే వున్నాయి. ఉన్నత స్థాయిలో అధికారులతో కూడిన ప్రభుత్వ దర్యాప్తు కమిటీని ఇలా సమాంతరంగా ఏర్పాటు చేయడం వల్ల ఏఏఐబీ దర్యాప్తునకు విఘాతం కలుగుతుంది. పైగా ఈ దర్యాప్తు ప్రక్రియలో ఐసిఎఓ అనెక్స్‌ 13 కింద ఏఏఐబీని ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశమైన ప్రభుత్వ జోక్యం గురించి సందేహాలు తలెత్తుతాయి.
ఏఏఐబీ దర్యాప్తు పరిధిలో వున్న అంశాలను ముఖ్యంగా విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలు, పరిస్థితులపై విచారణను తొలగిస్తూ తక్షణమే హెచ్‌ఎల్‌సి విచారణాంశాలను సవరించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది. ప్రమాదంపై దర్యాప్తును వృత్తిపరమైన నిపుణులకు విడిచిపెట్టడమే మంచిది. దీనికి బదులుగా విమానాశ్రయాలకు అత్యంత సమీపంలో నిర్దేశిత దూరంలో నివాస సముదాయాలు, భవంతులను నిర్మించకుండా తగు భద్రతా ప్రమాణాలను పాటిం చేలా చూసేందుకు నిబంధనలు, యంత్రాంగాలు రూపొందించాలని, వాటిని కఠినంగా అమలు చేయాలని ఇందుకు గానూ అహ్మదాబాద్‌, ఇతర విమాన ప్రమాదాల దర్యాప్తు నివేదికలను హెచ్‌ఎల్‌సీ పరిశీలించాలని సీపీఐ(ఎం) కోరింది. అహ్మదాబాద్‌ ఘటనలో కింద క్షేత్ర స్థాయిలో మరిన్ని మరణాలు సంభవించేందుకు అవకాశం చాలా వుంది. అయితే, అక్కడ పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు కూడా వున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవడం చాలా అవసరమని సీపీఐ(ఎం) స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -