కోట్లకు పడగలెత్తుతున్న పొలిటీషియన్స్
మంత్రులు అయ్యాక ..
పదవిని అడ్డం పెట్టుకుని దందాలు
కుటుంబ సభ్యుల ప్రమేయం
నాడు జనం కోసం పోరాడే వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసేవారు. అసెంబ్లీకి సైతం సైకిల్ తొక్కుతూ వచ్చిన నేతలూ ఉన్నారు. అలాగే గతంలో సుదూర ప్రాంతాలనుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా ఎంపీ, ఎమ్మెల్యే పేరిట సీట్లు రిజర్వ్ చేసి ఉండేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు రంగు మారాయి.
న్యూఢిల్లీ: పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి కార్పొరేటర్ వరకూ పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికైతే నా కేంటీ..నాకెంత అనే ధోరణితో కోట్ల రూపాయలను పోగేసుకుం టున్నారు. ఇలాగే రాష్ట్రమంత్రుల నుంచి కేంద్రమం త్రుల వరకూ లాబీయింగ్ కు ఏమాత్రం వెనకాడటంలేదు. ఇన్నాళ్లు అధికారానికి దూరంగా ఉన్న పొలిటీషియన్లు కాస్త.. మంత్రులయ్యాక భూకుంభకోణాలకు పాల్పడు తున్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ దందా అధికంగా సాగుతోంది. దీనికి తోడు ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియా అంటూ అక్రమార్జనకు పాల్పడి వేలకోట్లు దండుకుంటూ దందాలకు తెరలేపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భూ ఒప్పందాల వివాదం చర్చనీయాంశంగా మారింది. సీఎం మోహన్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారని ఒక ఆంగ్ల పత్రిక ఆరోపించింది. ఈ క్రమంలోనే మంత్రుల ఆస్తులకు సంబంధించిన నియమాలపై చర్చలు జరుగుతున్నాయి. మంత్రులు అయ్యాక రాజకీయ నాయకులు ఏ నియమాలు పాటించాలి. వారి వ్యాపార వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను పరిశీలిద్దాం.
ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం…
రాష్ట్ర మంత్రులందరూ ప్రతి సంవత్సరం తమ ఆస్తులను ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులు ప్రధానమంత్రికి నివేదించాల్సి ఉంటుంది. మరోవైపు, ముఖ్యమంత్రులు తమ ఆస్తులను ప్రధానమంత్రికి లేదా హోం మంత్రికి నివేదిం చాల్సి ఉంటుంది. మంత్రులు స్థిరాస్తులు, షేర్లు , డిబెంచర్లు, నగదు, ఆభరణాలపై అంచనా సమా చారాన్ని అందించాలి. అంతేకాకుండా మంత్రి అయిన తర్వాత, వారు తమ వ్యాపారాల నిర్వహణ, యాజమాన్యంతో ఉన్న అన్ని సంబం ధాలను తెంచుకోవాలి. ఒక మంత్రి, మంత్రిగా ఉన్నంత కాలం, ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీలోగా గత ఆర్థిక సంవత్సరానికి సంబం ధించిన తన ఆస్తులు , అప్పుల వివరాలను ప్రధాన మంత్రికి లేదా ముఖ్యమంత్రికి నివేదించాలి.
మంత్రి తన నిర్వహణ వాటాను కూడా బదిలీ చేయాలి, కానీ తన జీవిత భాగస్వామికి కాదు. లైసెన్సులు, పర్మిట్లు, లీజులు, కోటాలు లేదా టెండర్ల వంటి ప్రభుత్వంతో సహకారం అవసరమయ్యే ఏ వ్యాపారాన్నైనా, ఆ సంస్థ నుంచి తొలగించాలి అంతేకాకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్థిరాస్తిని కొనుగోలు చేయడం గానీ లేదా ప్రభుత్వానికి అమ్మడం గానీ చేయకూడదు. ఒకవేళ ఆస్తిని సాధారణ ప్రక్రియ ద్వారా సంపాదించినట్లయితే, అది వేరే విషయం. అంతేకాకుండా, మంత్రి అయిన తర్వాత ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించడం గానీ లేదా ఏదైనా కొత్త వ్యాపారాన్ని స్థాపించడం గానీ చేయకూడదు.
వారి కుటుంబ సభ్యులు ఏం చేయకూడనివి…
వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వానికి లేదా అనుమతులు, లైసెన్సులు, లీజులు మొదలైన వాటికి సంబంధం లేని ఏ వ్యాపారంలోనూ పాల్గొనకూడదు. ఒకవేళ కుటుంబ సభ్యులలో ఎవరైనా వేరే వ్యాపారాన్ని స్థాపించినా లేదా దాని నిర్వహణ,యాజమాన్యంలో పాల్గొన్నా, మంత్రి తప్పనిసరిగా ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి తెలియజేయాలి.
మంత్రి ఏం చేయకూడనివి…
మంత్రి గానీ లేదా ఆయన కుటుంబ సభ్యులలో ఎవరైనా గానీ, రాజకీయ, ధార్మిక లేదా ఇతర ఏ ప్రయోజనం కోసమైనా ఎలాంటి విరాళాన్ని స్వీకరించకూడదు. ఒకవేళ ఏదైనా నమోదిత సంస్థ, ధార్మిక సంస్థ, ప్రభుత్వ అధికార సంస్థచే గుర్తింపు పొందిన సంస్థ లేదా రాజకీయ పార్టీ కోసం ఆయనకు లేదా ఆమెకు ఏదైనా డబ్బు లేదా చెక్కు అందిస్తే, దానిని ఏ సంస్థ కోసం ఉద్దేశించారో ఆ సంస్థకే తిరిగి చెల్లించాలి. ఆయన లేదా ఆమె ఎలాంటి నిధుల సేకరణ కార్యకలాపాలలో పాల్గొనకూడదు. అలాగే, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు , వారి భాగస్వాములు, ప్రధానమంత్రి అనుమతి లేకుండా భారతదేశంలో గానీ లేదా విదేశాలలో గానీ ఏ విదేశీ ప్రభుత్వం లేదా విదేశీ సంస్థ కింద పనిచేయకూడదు. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే, వారు వాటిని తప్పనిసరిగా వెల్లడించాలి. ఏ విదేశీ మిషన్లోనైనా ఉద్యోగం చేయడం కచ్చితంగా నిషేధించాలి.
బహుమతులకు సంబంధించిన నియమాలు
ఒక మంత్రి తన దగ్గరి బంధువుల నుంచి తప్ప, మరే విలువైన బహుమతిని స్వీకరించ కూడదు. అలాగే, మంత్రికి అధికారిక సంబంధాలు లేదా లావాదేవీలు ఉన్న ఎవరి నుంచి అయినా ఆయన/ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి బహుమతిని స్వీకరించకూడదు. ఒక మంత్రి తన అధికారిక విధులను నిర్వర్తించడంలో అసౌకర్యం లేదా నష్టం కలిగించే అవకాశం ఉన్న ఎటువంటి రుణాన్ని తీసుకోకూడదు, లేదా తన కుటుంబ సభ్యులను ఎవరినీ అటువంటి రుణం తీసుకోవడానికి అనుమతించకూడదు.
విదేశాలలో స్వీకరించే బహుమతులకు సంబంధించిన నియమాలు
ఒక మంత్రి విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు లేదా భారతదేశంలో ఉన్నప్పుడు విదేశీ ప్రముఖుల నుంచి బహుమతులు స్వీకరించవచ్చు. అటువంటి బహుమతులు రెండు వర్గాలుగా విభజించబడ్డాయి. మొదటి వర్గంలో కత్తులు, వస్త్రధారణ మొదలైన ప్రతీకాత్మక స్వభావం గల బహుమతులు ఉంటాయి. వీటిని ఉంచుకోవచ్చు. రెండవ వర్గంలో ప్రతీకాత్మక స్వభావం లేని బహుమతులు ఉంటాయి. బహుమతి విలువ ₹5,000 కంటే తక్కువగా ఉంటే, మంత్రి దానిని ఉంచుకోవచ్చు. దాని విలువ ₹5,000 కంటే ఎక్కువగా ఉంటే, మంత్రి దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి.
అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..విదేశాల్లో ప్రధాని మోడీ పర్యటించినంతగా ఎవరూ పర్యటించలేదని రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే ఈ పర్యటనల వెనుక అదానీ, అంబానీలకు మేలు జరిగే విధంగా ఒప్పందాలు ఉన్నాయని పత్రికలు పరిశోధనాత్మకంగా ప్రచురిస్తున్నాయి. దేశాన్ని పాలించే ప్రధాని ఇలా ఉంటే..మేం ఏమైనా తక్కువ తిన్నామా..అంటూ అడ్డంగా దోచేయటానికి పొలిటీషియన్లు ఏమాత్రం సంకోచించటంలేదని పౌర సమాజం మండిపడుతోంది.
రంగుమారుతున్న రాజకీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



