ఫస్టియర్లో 67.4 శాతం, సెకండియర్లో 50.82 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థుల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సోమవారం హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. గతనెల 22 నుంచి 29 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ కేటగిరీ నుంచి 2,49,358 మంది పరీక్షలు రాయగా, 1,68,079 (67.4 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 1,16,304 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 85,920 (73.88 శాతం) ఉత్తీర్ణత పొందారు. 1,33,054 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 82,159 (61.75 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 12.13 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ కేటగిరీలో 17,004 మంది పరీక్ష రాస్తే, 11,452 (67.35 శాతం) మంది పాసయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ కేటగిరీలో 1,35,107 మంది పరీక్షలు రాయగా, 68,665 (50.82 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 51,975 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 28,313 (54.47 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 83,132 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 40,352 (48.54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.93 శాతం మంది అధికంగా పాసయ్యారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు https://tgbie.cgg.gov.in, http://results. cgg.gov.in వెబ్సైట్లను సంప్రదిం చాలని కృష్ణ ఆదిత్య సూచించారు. సోమవారం నుంచే ఆన్లైన్లో మార్కుల మెమోలను తీసుకోవాలనీ, మంగళవారం నుంచి కాలేజీ లాగిన్ ఐడీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాని కోరారు. వాటిలో ఏమైనా తప్పులుంటే పదిరోజుల్లో దరఖాస్తు చేయాలని తెలిపారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువు 23
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మంగళవారం నుంచి దరఖాస్తు చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. వాటి సమర్పణకు తుది గడువు ఈనెల 23 వరకు ఉందని సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 83.45 శాతం ఉత్తీర్ణతతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. 55.62 శాతం ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా అట్టడుగు స్థానంలో ఉందని వివరించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జనరల్ కేటగిరీలో 88.64 శాతం ఉత్తీర్ణత సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 33.54 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరిలో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) జయప్రదబాయి, జాయింట్ సెక్రెటరీలు శ్రీనివాస్, భద్రసేన్, భీంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
