– గాజాలో మారణహోమంపై మౌనం
– ఐరాస తీర్మానాలకు దూరం
– మారిన వైఖరితో దెబ్బతింటున్న దేశ ప్రతిష్ట
ప్రపంచంలో భారత్ కీర్తి ప్రతిష్టలు మసకబారుతున్నాయి. నరేంద్ర మోడీ హయాంలో దేశ విదేశాంగ విధానం తేలిపోతోంది. వ్యూహాత్మక స్పష్టతను కోల్పోతోంది. మన విదేశాంగ విధానానికి ఓ సిద్ధాంతం అంటూ లేకుండా పోతోంది. నాటకీయతే ఎక్కువగా కన్పిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ పాటించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇటీవల ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ జరిగినప్పుడు భారత్ గైర్హాజరు కావడం దేనికి సంకేతం? తీర్మానానికి 149 దేశాలు అనుకూలంగా ఓటేస్తే ఆ ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం సమర్ధనీయమేనా?
న్యూఢిల్లీ: పాలస్తీనాపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్కు గైర్హాజరు కావడం భారత్ నైతిక పతనాన్నే సూచిస్తోంది. మానవతా సంక్షోభం తలెత్తినప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడాల్సింది పోయి గోడ మీద పిల్లి మాదిరిగా కూర్చోవడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం ఇజ్రాయిల్ సాగి స్తున్న మారణహోమంలో ఇప్పటి వరకూ 55,297 మంది సమిధలయ్యారు. కనీసం 12,426 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువమంది అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ మార్చి 18వ తేదీ నుంచి ఉల్లంఘి స్తోంది. అప్పటి నుంచి 5,014 మంది చనిపోగా 16,385 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది జనవరి నుంచి గాజాలో 90 శాతానికి పైగా నివాస గృహాలు దెబ్బ తిన్నాయని ఐరాస అంచనాలను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. 1,60,000 గృహాలు పూర్తిగా ధ్వంసం కాగా 2,76,000 ఆవాసాలు తీవ్రంగానో, పాక్షికంగానో దెబ్బతిన్నాయి. ఇంత జరుగుతున్నా భారత్ మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూనే ఉంది. మన దేశం చారిత్రకంగా పాలస్తీనాకు న్యాయం జరగాలని కోరుకుంటోంది. తాజా గైర్హాజరుతో ఆ వైఖరి నీరుకారిపోతోంది.
నాడు అలా…
ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించాల్సిందిగా 1975లో భారత ప్రభుత్వం పాలస్తీనా విమోచనా సంస్థ (పీఎల్ఓ)ను ఆహ్వానించింది. ఐదేండ్లు గడిచిన తర్వాత పాలస్తీనాకు దౌత్య హోదా ఇచ్చింది. 1988లో తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని పీఎల్ఓ ప్రకటించినప్పుడు భారత్ వెంటనే గుర్తింపు ఇచ్చింది. యాసర్ అరాఫత్ భారత్ను సందర్శించిన సందర్భాల్లో ప్రభుత్వాధినేతగానే ఆయనకు స్వాగతం పలికింది. 1992లో భారత్ టెల్ అవీవ్లో దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ గాజాలో ప్రతినిధి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే పాలస్తీనా ఉద్యమం హమాస్, పీఎల్ఓ మధ్య చీలిపోవడంతో ఆ కార్యాలయం రమల్లాకు మారింది. గాజాపై హమాస్ నియంత్రణ సాధించింది.
వెస్ట్బ్యాంక్ను పాలించిన పాలస్తీనా అథారిటీ అధిపతి మహమూద్ అబ్బాస్ పదేండ్ల యుపీఏ ప్రభుత్వ హయాంలో మన దేశంలో నాలుగు సార్లు (2005, 2008, 2010, 2012) పర్యటించారు. 2011లో యునెస్కోలో పాలస్తీనా పూర్తి స్థాయి సభ్యదేశంగా మారేందుకు భారత్ అనుకూలంగా ఓటేసింది. ఓ ఏడాది తర్వాత ఐరాసలో పాలస్తీనాను సభ్యత్వం లేని పరిశీలక దేశంగా మార్చడానికి వీలుకల్పించే తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దానిని స్పాన్సర్ చేసిన దేశాల్లో భారత్ కూడా ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా… అంటే 2015 సెప్టెంబరులో ఐరాస ప్రాంగణంలో పాలస్తీనా పతాకాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణకు అనుకూలంగా 2023లో మన దేశం ఓటు వేసింది. కానీ ఇప్పుడు ఆకస్మికంగా భారత్ వైఖరిలో మార్పు రావడానికి కారణమేమిటి?
ఎందుకీ ఉదాశీనత?
ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ద్వారా పాలస్తీనాకు ఇప్పటి వరకూ అందజేస్తున్న చారిత్రక మద్దతును భారత్ కోల్పోయింది. అంతేకాక గాజాలో తలెత్తిన హృదయవిదారక సంక్షోభం పట్ల మన ఉదాశీన వైఖరి బయటపడింది. ప్రభుత్వ విదేశాంగ విధానం సూత్రాల ఆధారంగా రూపొందడం లేదు. మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ వ్యూహకర్తలు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, మైనారిటీ నేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మత పెద్దలు, ఎన్నికల కమిషనర్లు, సీబీఐ అధిపతులను లక్ష్యంగా చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం ఉపయోగించిన పెగాసస్ స్పైవేర్ వంటి కొనుగోళ్లతో ముడిపడిన సంబంధాలు ఆ విధానాన్ని నిర్దేశిస్తున్నాయని స్పష్టమవుతోంది. ఈ వైఖరి ఒక్క గాజాకే పరిమితం కాదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను నివారించి శాంతిని నెలకొల్పాలంటూ ఐరాస తీర్మానాలు చేసినప్పుడు కూడా భారత్ వాటికి దూరంగానే ఉంది. గాజాలో కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐరాస సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు ఆమోదించినప్పుడు కూడా భారత్ ప్రేక్షక పాత్రే పోషించింది.
ప్రపంచం ఓ కుటుంబం వంటిదని మోడీ చెబుతుంటారు. కానీ ఆస్పత్రులు, పాఠశాలలు బాంబు దాడులకు గురైనప్పుడు… ప్రజలు భయంతో తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నప్పుడు… ఆ సహాయ శిబిరాలపై కూడా బాంబు దాడులు జరుగుతున్నప్పుడు…ఆకలితో అలమటిస్తున్న గాజా ప్రజానీకానికి సహాయ సామగ్రి అందకుండా అడ్డుకుంటున్నప్పుడు…ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు మన విదేశాంగ విధానం ఓ వ్యక్తి మనోభావాలను బట్టి మారిపోతోందని, ఇంతకంటే దురదృష్టం ఏముంటుందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆలింగనాలతో ఏం ఒరిగింది?
గాజాతో పాటు ఇతర అంశాలపై మోడీ అనుసరిస్తున్న భిన్న ధృవ విధానం కారణంగా అంతర్జాతీయంగా భారత్ వైఖరి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది. ఓ వైపు పారిశ్రామికంగా, ఆర్థికంగా వెనుకబడిన దేశాల వాణిగా నిలవాలని ఆశిస్తూనే మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆ స్వరాన్ని నొక్కి పెడుతోంది. ఒకప్పుటి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనేది ఇప్పుడు వ్యూహాత్మక అస్పష్టతగా మారిపోయింది. ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్న ప్పుడు ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలను ఆలింగనం చేసుకుంటారు. కానీ వాటి వల్ల దేశానికి ఒరి గిందేమిటో తెలియడం లేదు. మరోవైపు ముస్లింల పట్ల బీజేపీ అవలంబిస్తున్న ద్వేషపూరిత రాజకీయా లను ఖతార్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఖండించాయి. భారత రాయబారు లను పిలిపించి క్షమాపణలు కోరాయి. భారతీయ వస్తువులను బహిష్కరించాలంటూ ఖతార్లో పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. భారత లౌకిక ప్రమాణాలకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.