నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలోని ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల ప్రతిదాడులతో ఆయా దేశాల్లో పలు భవనాలు నేలమట్టమవుతున్నాయి. ఇరాన్ క్షిపణులు.. ఇవాళ ఇజ్రాయెల్ బీర్షెవాలోని సొరొక ఆస్పత్రిపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి కారణంగా ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతిన్నట్లు దాని ప్రతినిధి వెల్లడించారు. దీంతో చికిత్స నిమిత్తం బాధితులు ఎవరూ తమవద్దకు రావద్దని సదరు ప్రతినిధి అభ్యర్థించారు. ఇజ్రాయెల్లోని ప్రముఖ మెడికల్ సెంటర్లలో ఇది ఒకటి.
సొరొక మెడికల్ సెంటర్పై ఇరాన్ దాడి యుద్ధ నేరం కిందకు వస్తుందని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ మంత్రి ఉరియల్ బుసో పేర్కొన్నారు. ‘‘ఇది ఇరాన్ పాలకులు చేసిన నేరం. ఉద్దేశపూర్వకంగా అమాయక ప్రజలు, ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకొన్నారు. ఆరోగ్య శాఖ ఇటువంటి పరిణామాలకు ముందే సిద్ధపడింది. తక్షణమే స్పందించిన వారికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
