– గాజా, ఇరాన్లో యుద్ధాలను నిరసిస్తూ
– లక్షా 50వేల మందితో ఆందోళన
– పాలక వర్గాల నిర్లక్ష్య వైఖరికి ఖండన
దిహేగ్: నియంతృత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో అట్లాంటిక్ వ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు సమాంతరంగా అంతర్జాతీయ న్యాయస్థానం వున్న ది హేగ్లో ఆదివారం పెద్ద ఎత్తున ‘రెడ్ లైన్’ ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా 1,50,000మందికి పైగా పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇటువంటి ప్రదర్శన జరగడం ఇది రెండోసారి. గాజాలో ఊచకోతకు, ఇరాన్పై యుద్ధానికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత, అసంతృప్తి, నిరసనలకు నిదర్శనంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. నెదర్లాండ్స్ ప్రభుత్వ ఉదాసీనతను మొత్తంగా యురోపియన్ పాలక వర్గాల నిర్లక్ష్యవైఖరిని ఖండిస్తూ ప్రజలు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆక్స్ఫామ్ నొవిబ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పాక్స్, సేవ్ ది చిల్డ్రన్, తదితర సంస్థలకు చెందిన కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఇజ్రాయిల్ అత్యాచారాలు, అరాచకాల పట్ల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని వారు ఖండించారు. ఇయు-ఇజ్రాయిల్ ఒప్పందాలను సమీక్షించాలని, ఆయుధ ఆంక్షలతో సహా అన్ని రకాల ఆంక్షలను విధించాలని ప్రదర్శకులు పిలుపిచ్చారు. అంతూ దరి లేకుండా సాగుతున్న ఈ యుద్ధాల వెనుక పెట్టుబడిదారీ వ్యవస్థ చోదక శక్తిగా పనిచేస్తోందని వారు విమర్శించారు. బ్రస్సెల్స్లో కూడా ఇదే రీతిలో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది.అందులో కూడా దాదాపు లక్ష మంది పాల్గొన్నారు. సామ్రాజ్యవాదం పురిగొలిపే ఈ యుద్ధాలను తీవ్రంగా నిరసిస్తూ, అంతర్జాతీయంగా కార్మిక వర్గ చైతన్యంలో భాగంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. యుద్ధాలు, పొదుపు చర్యలు, ఊచకోతలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం రాజకీయంగా, స్వతంత్రంగా, అంతర్జాతీయంగా సమైక్య, సోషలిస్టు ఉద్యమంకోసం పోరాడాలని నేతలు పిలుపిచ్చారు.
ఇరాన్, ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీల ఖండన
పశ్చిమాసియా వ్యాప్తంగా ఇజ్రాయిల్ సాగిస్తున్న సైనిక దురాక్రమణను ఇజ్రాయిల్ కమ్యూనిస్టు పార్టీ, ఇరాన్కు చెందిన టుడెV్ా పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా ఇరాన్పై ప్రత్యక్షంగా దాడికి దిగడాన్ని కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులను ఏవో మిలటరీ దాడులుగా భావించరాదని, మొత్తంగా పశ్చిమాసియా రాజకీయ భౌగోళిక స్వరూపాన్ని మార్చడానికి ఉద్దేశించిన విస్తృత అస్థిరతా వ్యూహంలో భాగమని విమర్శించాయి. అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్రపక్షాల దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతోందని ఆ రెండు పార్టీలు విమర్శించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తక్షణమే అన్ని మిలటరీ ఆపరేషన్లు నిలిపివేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో ఈ ప్రాంతం విస్తృత యుద్ధంలోకి మళ్ళుతుందని విమర్శించాయి. గాజాలో మరింత విధ్వంసం జరగకుండా నివారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు జరిగినదానికి అంతర్జాతీయ జవాబుదారీతనం కావాలని కోరాయి. ప్రధాని నెతన్యాహు వైఖరిని నిరసించాయి. అమెరికా, బ్రిటన్ సహా ఇతర కీలక యురోపియన్ దేశాలు అందిస్తున్న రాజకీయ, సైనికమద్దతును తీవ్రంగా ఖండించాయి.
హేగ్లో ‘రెడ్ లైన్’ ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES