నవతెలంగాణ-హైదరాబాద్: టెలిగ్రాం మెసేజింగ్ యాప్ ఓనర్, బిలియనీర్ పావెల్ డురోవ్ తన ఆస్తుల వీలునామా గురించి కీలక ప్రకటన చేశారు. తన వీర్య దానం వల్ల పుట్టిన సుమారు వంద మంది పిల్లలకు .. దాదాపు 20 బిలియన్ల డాలర్ల సంపాదన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ మ్యాగ్జిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. పావెల్ డురోవ్కు ముగ్గురు భాగస్వామ్యులు ఉన్నారు. వారికి మొత్తం ఆరు మంది పిల్లలు ఉన్నారు. అయితే తాను సంపాదించిన 20 బిలియన్ల డాలర్ల ఆస్తి 106 పిల్లలకు పంచనున్నట్లు చెప్పారు.
స్వయంగా కన్నవారికే కాకుండా.. తన వీర్య దానం వల్ల పుట్టిన వంద మంది పిల్లలకు కూడా తన ఆస్తిని రాసిచ్చినట్లు పేర్కొన్నారు. గత 15 ఏళ్ల నుంచి సుమారు 12 దేశాల్లో పావెల్ డురోవ్కు చెందిన వీర్యాన్ని వాడిన వారున్నారు. స్పెర్మ్ డొనేషన్ వల్ల వంద మంది పుట్టినట్లు ఆయన చెప్పారు. ఫ్యామిలీ లైఫ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తన వీలునామాలో మరో విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తన పిల్లలు కానీ, తన వీర్యం వల్ల జన్మించిన వారు కానీ, 30 ఏళ్ల తర్వాతనే తన సంపాదన వాడుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. తన తదనంతరం తనకు పుట్టిన పిల్లలు కలిసి ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.