నవతెలంగాణ-హైదరాబాద్ : రానున్న మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, పేదల కళ్లల్లో ఆనందం చూడటమే ఇందిరమ్మ రాజ్యం ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని పునరుద్ఘాటించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మోతె మండలంలోని పైలెట్ గ్రామమైన విభళాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి పొంగులేటి గురువారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నటువంటి పలు ఇళ్లల్లోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో మంత్రి కాలు పెట్టిన ప్రతి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన దంపతులకు కొత్త వస్త్రాలను అందజేశారు. టెక్నికల్ ప్రోబ్లమ్స్తో బిల్లులు ఆలస్యం కాకుండా చూడాలని హౌసింగ్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనేది నిరంతర ప్రక్రియ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని వివరించారు. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 గృహాలు మంజూరు చేసినట్లుగా వివరించారు. నిరుపేదలకు అమలు చేసే సంక్షేమ పథకాల్లో కమీషన్లు రావని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారంటూ విమర్శించారు. ప్రస్తుతం అది ఏమైందో అందరికీ తెలుసని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపామని చెప్పారు.