జులై 9న జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య
ఖమ్మంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర 4వ మహాసభ
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజా రవాణా రంగాన్ని, కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆ దిశగా రూపకల్పన చేసే విధంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర 4వ మహాసభలో చర్చలు జరగాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలు మహాసభలో ఆమోదం పొందాలని, తెలంగాణ ఆర్టీసీ కార్మికవర్గానికి మహాసభ ఐక్యపోరాటాల సందేశం అందించాలని అన్నారు. శనివారం ఖమ్మంలోని నేపాల్ దేవ్ భట్టాచార్య నగర్, యర్రా శ్రీకాంత్ ప్రాంగణం (ఐఎంఏ హాల్)లో వీరాంజనే యులు అధ్యక్షతన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర 4వ మహాసభ ప్రారంభ సూచికగా రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అరు ణారుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతినిధు లందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిం చారు. అనంతరం ప్రారంభసభలో ఎస్డబ్ల్యూఎఫ్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గడ్డం లింగమూర్తి ప్రతినిధులను వేదికపైకి ఆహ్వానించారు. నేపాల్ దేవ్ భట్టాచార్య, యర్రా శ్రీకాంత్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.లక్ష్మయ్య మాట్లాడుతూ.. 2019 మోటారు వాహనాల చట్టం సవరణలతో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా దేశంలో ఉన్న ఆర్టీసీలకు సమాధి కట్టే విధానాలు చేసిందన్నారు. అక్రమ రవాణాను సక్రమ రవాణాగా చేసే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రయివేట్ ఆపరేటర్లను, అగ్రి గ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ పాలసీ పేరుతో ఊబర్, ఓలా లాంటి సంస్థలతో పాటు, బహుళ జాతి రవాణా సంస్థలు కూడా భారత రవాణా రంగంలో చొర బడ్డాయన్నారు. దేశంలో రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం విజయం సాధించి నట్టుగా, కార్మిక వర్గం కూడా తమకు నష్టదాయక మైన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకూ సమరశీల పోరాటాలు నిర్వహించాలన్నారు. జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికవర్గం మొత్తం పాల్గొనాలన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా రవాణా రంగ అభివృద్ధిలో వెనుకబడ్డామని, రాష్ట్రంలో దాదాపు 500 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత నిర్బంధం మధ్య 55 రోజుల సమ్మె పోరాటం చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను పరిష్కరించడం లేదన్నారు. అందరం కలిసి గరిష్ట ఐక్యతను ప్రదర్శిద్దాం.. పోరాడి విజయాలు సాధిద్దామని పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు తీర్మానాన్ని బలపరుస్తూ ”కార్మికవర్గ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా విశాల ఐక్యతతో ముందుకు సాగుదాం” అని అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు థామస్రెడ్డి తీర్మానాన్ని బలపరుస్తూ ఆర్టీసీలో ఎస్డబ్ల్యూఎఫ్ అంటే సిద్ధాంతం, నిబద్ధత కలిగిన సంఘమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రవాణా విధానం ప్రవేశపెట్టినా అది తెలంగాణలో అమలవుతుందనీ, తెలంగాణ ఆర్టీసీ కార్మిక వర్గం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, విశాల ఐక్యతతో ఉమ్మడి ఎజెండాతో ఐక్యంగా ముందడుగు వేద్దామని అన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బత్తినేని హనుమంతరావు తీర్మానాన్ని బలపరుస్తూ.. ఆర్టీసీ కార్మికులకు నిత్య చైతన్యం అందించే పోరాటాల సంఘం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభ ఖమ్మంలో జరగటం సంతోషకరమని తెలిపారు. ఆహ్వాన సంఘం తరపున గుండు మాధవరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు, ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, ఏపీ ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు సిహెచ్. సుందరయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ పూర్వ అధ్యక్షులు ఎంఎన్ రెడ్డి, పూర్వ కార్యదర్శులు వి.రాములు, ఎంవీఎస్ఎస్ నారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పద్మావతి, ప్రచార కార్యదర్శి పి.రవీందర్ రెడ్డి, నాయకులు భిక్షపతి గౌడ్, బత్తుల సుధాకర్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.విక్రం, ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపేందర్, ఆహ్వాన సంఘం కోశాధికారి గుగ్గిళ్ళ రోశయ్య పాల్గొన్నారు.
ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల కోసం పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES