నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గనుల తవ్వకాలపై వార్షిక క్యాలెండర్ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెండేండ్లుగా గనుల శాఖలో ఆదాయాల తీరును ఈ సందర్భంగా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మత్తుకు ఇసుక తరలించాల్సిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో పనులకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశమున్న రీచ్లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించి నీటి పారుదల శాఖతో సమన్వయం చేసుకుని సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని భట్టి ఆదేశించారు.
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన మంత్రి సీతక్క
ప్రజావాణిలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మంగళవారం హైదరాబాద్లోని మహాత్మాజ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమ తీరును పర్యవేక్షించేందుకు సీతక్క ఆకస్మికంగా సందర్శించారు.