– 400-600 చదరపు అడుగులు లేకుంటే అనుమతి నిరాకరణ
– నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తేనే బిల్లులు
– యాప్ ఆధారంగా దశలవారీగా చెల్లింపులు
– కొలతలపై అవగాహన లేక లబ్దిదారులు అయోమయం
– అధికారుల్లోనూ అస్పష్టత
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. కానీ లబ్దిదారులకు ఈ కొలతలు తలనొప్పిగా మారాయి. కొలతలపై నిర్దిష్టమైన అవగాహన లేకపోవడంతో అటు లబ్దిదారులు.. ఇటు అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇండ్లు మంజూరైన లబ్దిదారులు తప్పనిసరిగా 400- 600 చదరపు అడుగుల విస్తీర్ణం, అంతకన్నా ఎక్కువ ప్రాంతంలోనే నిర్మించాలనే నిబంధన ఉంది. ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేపడితేనే బిల్లులు చెల్లిస్తారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కొందరు అసలు ఇల్లు నిర్మించకుండానే ఇతరుల ఇండ్లను చూపించి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలాంటి వాటికి అవకాశం లేకుండా చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
నిర్ణీత కొలతలు లేకుంటే తిరస్కరణ
ఏఈలు బేస్మెంట్ వరకు పూర్తయిన ఇండ్లను పరిశీలించి వాటి కొలతలు తీసుకుని సరిగా ఉంటేనే ఫొటో అప్లోడ్ చేస్తారు. డీఈలు సూపర్చెక్ చేసి సరిగ్గా ఉంటే బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగల్ ఇస్తారు. నిర్ణీత కొలతల ప్రకారం లేని ఇండ్లను నిరభ్యంతరంగా తిరస్కరిస్తారు. లబ్దిదారులు సరి చేసుకుంటే పున్ణ పరిశీలనకు అవకాశం ఉంటుంది.
ఏవి ప్రామాణికమో తెలియక అయోమయం
ఇందిరమ్మ ఇండ్ల కొలతల విషయంలో లబ్దిదారులు అయోమయానికి గురవుతున్నారు. అధికారులకు కూడా సరైన అవగాహన లేకపోవడంతో దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో తెలియని గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు చేసిన తప్పిదానికి లబ్దిదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నాలుగో వార్డుకు చెందిన వేణుగోపాల్.. ఇందిరమ్మ ఇంటి కోసం ఆయన భార్య గంగ (50) పేరుతో అప్లరు చేశారు. కానీ మున్సిపాలిటీలో ప్రయివేటు కంప్యూటర్ ఆపరేటర్ దరఖాస్తుదారు గంగ పేరుకు బదులు భర్త వేణుగోపాల్ పేరు నమోదు చేశాడు. పరిశీలన నిమిత్తం వచ్చిన వార్డు ఆఫీసర్ స్వప్న, కమిషనర్ శ్రీకాంత్ భార్యభర్తల్లో ఎవరి పేరున్నా ఏమీ కాదన్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల స్పెషల్ ఆఫీసర్, మున్సిపాలిటీ డీఈ మురళీ తనిఖీ చేశారు. కానీ వార్డు ఆఫీసర్ లబ్దిదారు పేరు తారుమారైందని చెప్పలేదు. కానీ హౌసింగ్ ఏఈ స్వాతి (ఔట్ సోర్సింగ్) పరిశీలన నిమిత్తం వచ్చి లబ్దిదారు మారిన దృష్డ్యా ఇవ్వటం కుదరదన్నారు. పై పెచ్చు ఇందిరమ్మ ఇండ్ల కొలతల ప్రకారం ఫేసింగ్ 13, పొడవు 55 ఉంది. వెనుక, ముందు 15 ఫీట్లు వదిలారు. గల్లీ కోసం మరో మూడు ఫీట్లు వదలటంతో 360 చదరపు గజాలు మొత్తం విస్తీర్ణం ఉంది. తొలుత స్లాబ్ ఏరియాను లెక్కిస్తామన్న అధికారులు.. తర్వాత బేస్మెంట్ అన్నారు. తర్వాత పిల్లర్ టూ పిల్లర్ అన్నారు. దాంతో 360 చదరపు గజాలకు కొలతలు వచ్చాయి. తర్వాత దాన్ని మార్చడంతో 410 చదరపు గజాలు వచ్చింది. అయితే పిల్లర్ టూ పిల్లర్ ప్రకారం చూస్తే 360 చదరపు గజాలే వస్తుంది. ఓవైపు లబ్దిదారు పేరు మారడం… మరో వైపు కొలుతల విషయంలో స్పష్టత లేకపోవడంతో వేణుగోపాల్ దంపతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఉంటున్న ఇంటిని కూల్చివేశారు. నెలకు రూ.4వేలు కిరాయి చెల్లిస్తూ.. అదే స్థలంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.
బేస్మెంట్ ప్రామాణికం : గంగోని శంకర్, పీడీ, భద్రాద్రి కొత్తగూడెం
బేస్మెంట్ ప్రామాణికంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలి. ప్లిన్త్ ఏరియా 400-600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం (ఇటుకల కన్స్ట్రక్షన్) చేపట్టాలి. కొలతల ప్రకారం లేకుంటే ఇండ్ల బిల్లులు మంజూరు కావనే విషయాన్ని లబ్దిదారులు గమనించాలి.
ముగ్గు పోసినప్పటి నుంచి..
ఇల్లుకు ముగ్గు పోసినప్పటి నుంచి బేస్మెంట్, స్లాబు, గోడలు, ప్లాస్టరింగ్ పూర్తయిన తర్వాత ఇలా వివిధ దశల్లో ఆ యాప్ ద్వారా నిర్మాణం జరుగుతున్న ఇంటి ఫొటోలను తీసి అధికారులు అప్లోడ్ చేస్తారు. ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్కు, తర్వాత వివిధ దశల్లో తీసిన లొకేషన్ సరిపోలితేనే బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఒక యాప్ ఇచ్చారు. వారు ముగ్గు పోసిన ఇండ్లను ఫొటో తీసి పంపిస్తున్నారు. టెక్నికల్గా ఇండ్లు నిర్ణీత కొలతల ప్రకారం నిర్మిస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తున్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉందా? లేదా? అనే దాన్ని ధ్రువీకరించేందుకు ఈ ఇండ్లకు సంబంధించిన ఏఈల దగ్గర మరో యాప్ ఉంటుంది.