నవతెలంగాణ-హైదరాబాద్: ఇండిగో సంస్థలో కులవివక్ష బుసలు కొట్టింది. కులం పేరుతో ముగ్గురు సీనియర్ అధికారులు తనను అవమానించినట్లు 34 ఏళ్ల పైలెట్ ఒకరు కేసు నమోదు చేశారు. విమానం నడిపేందుకు సరిపోనని, చెప్పులు కుట్టుకోవాలని తీవ్రంగా అవమానించినట్లు తెలిపారు. పైలెట్ ఫిర్యాదుతో ఇండిగో అధికారులు తపస్ డే, మనీష్ సాహ్నిప మరియు కెప్టెన్ రాహుల్ పాటిల్లపై ఎస్సి,ఎస్టి (అత్యాచారాల నిరోధక చట్టం) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
పైలెట్ మొదట బెంగళూరు పోలీసులను సంప్రదించాడు. పైలెట్ ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ ఎఫ్ఐఆర్ను ఇండిగో ప్రధాన కార్యాలయం ఉన్న గురుగ్రామ్కు బదిలీ చేశారు. శిక్షణా పైలెట్ ఏప్రిల్ 28న ఇండిగో గురుగ్రామ్ కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని తన ఫిర్యాదులో ప్రస్తావించారు. 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ”నువ్వు విమానం నడిపేందుకు తగినవాడివి కాదు. వెనక్కి వెళ్లి చెప్పులు కుట్టుకో. ఇక్కడ వాచ్మెన్గా ఉండేందుకు కూడా నీకు అర్హత లేదు” అని అవమానించినట్లు పేర్కొన్నారు. తనను రాజీనామా చేయమని బలవంతం చేయడమే ఈ వేధింపుల లక్ష్యమని తెలిపారు.
ఎస్టి వ్యక్తిగా తనను కించపరిచే లక్ష్యంతో అవమానకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్యాయంగా జీతంలో కోతలు విధించడం, బలవంతంగా తిరిగి శిక్షణా తరగతులకు పంపించడం, హెచ్చరికల లేఖల ద్వారా తాను వృత్తిపరమైన వేధింపులకు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు, ఇండిగో నైతిక విలువల కమిటీకి ఫిర్యాదు చేపశారని అన్నారు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. చివరికి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఘటనపై ఇండిగో ఇంకా స్పందించలేదు.