నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ విమానం ప్రమాదం తర్వాత ఎయిరిండియాలో నాణ్యత లోపాలు వరసగా బయటపడుతున్నాయి. సోమవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం అనూహ్యంగా ల్యాండ్ అవ్వకుండానే ఢిల్లీకి తిరిగి వచ్చేసింది.
IX-2564 విమానం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయల్దేరింది. మధ్యలో ఆ విమానం జమ్ములో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, పైలట్ విమానాన్ని జమ్ము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయలేదు. జమ్ము ఎయిర్పోర్ట్పై కొద్దిసేపు విమానం చక్కర్లు కొట్టిన అనంతరం అది తిరిగి ఢిల్లీకి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉందని, రన్వే కూడా క్లియర్గా ఉన్నప్పటికీ.. ల్యాండింగ్ ప్రాంతాన్ని పైలట్ గుర్తించలేకపోయాడని అధికారులు పేర్కొన్నారు. అయితే, విమానం ఢిల్లీకి తిరిగి రావడానికి దారితీసిన కారణాలు మాత్రం తెలియరాలేదు.