ఇరాన్ అణుకేంద్రాల మీద బి2 బాంబర్లతో దాడిచేసిన అమెరికా దుశ్చర్యను యావత్ సభ్య సమాజం ఎలుగెత్తి ఖండించాల్సిన అవసరం ఉంది.ఈ చర్య ఏ విధంగా చూసినప్పటికీ అన్ని చట్టాలు, సాంప్రదాయాలు, సార్వభౌమత్వాలను హరించేదిగా ఉన్నందున యుద్ధ నేరాల కింద విచారించాలి. ఒక దేశం అణుకార్యక్రమం కలిగి ఉండాలా లేదా అన్నది దానికి సంబంధించిన అంశం. ఇరాన్ అణుకార్యక్రమం నుంచి వైదొలిగితే దానికి తగిన విధంగా పరిహారం లేదా మరొకవిధంగా లబ్దిచేకూర్చుతామని 2015లో ఒప్పందం చేసుకున్నది అమెరికా. దాన్నుంచి ఇదే డోనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018లో ఏకపక్షంగా వైదొలిగింది కూడా అమెరికానే. ఆ కారణంగానే ఇరాన్ తన అణుకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. ఏ విధంగా చూసినప్పటికీ అది సమర్ధనీయమే. ఒక వేళ చట్టవిరుద్ధం అనుకుంటే దానికి ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, ఇతర సంస్థలున్నాయి. వాటిలో చర్చ జరగాలి. దోషం ఏదైనా ఉంటే అక్కడ తేల్చాలి తప్ప దాడి చేయటానికి ఇజ్రాయిల్కు, దానికి సమర్ధనగా బాంబులు వేసేందుకు అమెరికాకు ఉన్న హక్కేంటి? ఈదాడిలో అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయా లేదా అన్నది వేరే అంశం. అసలు దాడి చేయటానికి అదెవరు?
తమపై అమెరికా దాడికి పూనుకుంటే ప్రతి చర్యలు ఉంటాయని ఇరాన్ ముందునుంచే హెచ్చరించింది. అయితే ఇది రాసే సమయానికి ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయిల్ మీద కొనసాగుతున్న క్షిపణి దాడులు తప్ప అమెరికా సైనిక స్థావరాలు లేదా మధ్యధరా సముద్రంలో, ఇతర చోట్ల ఉన్నదాని యుద్ధ నౌకల మీద గానీ ఎలాంటి దాడులు జరిగినట్లు వార్తలు లేవు. ఇరాన్ మీద అమెరికా దాడితో ఇరానీయన్లు భయభ్రాంతులకు గురైతే ఇరాన్ చేసిన హెచ్చరికతో ప్రపంచంలో ఉన్న ప్రతి అమెరికన్ తమకు ఎప్పుడేం జరుగుతుందో అని వణికి పోతున్నారు. కడుపు మండిన వారు ఎప్పుడేం చేస్తారో తెలియదు. బాధ్యతారహితమైన ట్రంప్ దుశ్చర్య అమెరికన్లను ప్రమాదంలోకి నెట్టింది. ఈ చర్యకు నిరసనగా అమెరికాలో కొన్ని చోట్ల వ్యతిరేక ప్రదర్శనలు జరిగినట్లు వార్తలు. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో ఓడిపోయి చేతులేత్తేసిన జపాన్పై అణుబాంబులు వేసిన అమెరికా చర్య దాన్ని దెబ్బతీయటానికి కాదు, తన దగ్గర ఎలాంటి ప్రమాదకర ఆయుధం ఉందో చూపి యావత్ ప్రపంచాన్ని తనకు దాసోహం చేసుకొనే దుష్టయత్నం.
ఈ రోజు అణుకార్యక్రమం గురించి తాను చెప్పినట్లు వినలేదని బాంబులు వేసిన అమెరికా, రేపు మరొక దేశం మరొక కారణంతో తనకు లొంగకపోతే ఇదే విధమైన దుర్మార్గానికి పాల్పడదనే నమ్మకం ఏముంది? కొన్ని దేశాలనైనా భయపెట్టేందుకు అమెరికా చేసిన దాడి తప్ప మరొకటి కాదు. నాడు అణుబాంబులు చూసి ప్రపంచాన్ని బెదిరిస్తే తర్వాత సోవియట్, చైనా, తదితర దేశాలన్నీ అణుబాంబులను సమకూర్చుకున్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది. మనదేశం కూడా అణుపరీక్షలు జరపరాదని అమెరికా బెదిరించింది. అయితే సోవియట్తో ఉన్న రక్షణ ఒప్పందం, తదితర కారణాలతో అది ఇరాన్ మాదిరి దాడుల దుస్సాహసానికి పూనుకోలేదు. అయితే మనమీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతరిక్ష రంగంలో మనం కూడా ఎక్కడ పోటీకి వస్తామో అన్న ఉక్రోషంతో ఆ కార్యక్రమం, ప్రయోగాలను కూడా అడ్డుకొనేందుకు చూసింది. మనదేశాన్ని లొంగదీసుకొనేందుకు కాశ్మీరు, పంజాబ్, ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదులను రెచ్చగొట్టి తలనొప్పులు కలిగించింది.
పశ్చిమాసియాలో ఇరాన్ను లొంగదీసుకొనేందుకు, చమురు సంపదను కొల్లగొట్టేందుకు అక్కడ ఏర్పాటు చేసిన తొత్తు పాలకులనో తోసిపుచ్చి జనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి లౌకికశక్తులు నాయకత్వం వహిస్తు న్నాయా? మతశక్తులా అన్నది వారి అంతర్గత వ్యహారం. జనమే తేల్చుకోవాల్సిన అంశం. మతశక్తులే అనుకుంటే వారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంతోనే కదా అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకున్నది, వైదొలగిందన్నది మరచిపోరాదు. అనేక దేశాల్లో నియంతలు పాలకులుగా ఉన్న దేశాలను అమెరికా సమర్ధించింది, మద్దతు ఇచ్చింది. అమెరికా దాడులు చేసినా తమ అణుకార్యక్రమం కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా దుర్మార్గాన్ని ఖండించటంలో ఐరాస, చైనా, రష్యా ముందున్నాయి. ప్రపంచ విశ్వగురువును తానే అనుకుంటున్న మనదేశం ఇంతవరకు నోరుమెదపలేదు. గాజాలో ఇజ్రాయిల్ మారణకాండను ఆపివేయాలన్న ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ను బహిష్కరించినపుడే మనమీద ఎవరి ఒత్తిడి పని చేస్తున్నదో తేలిపోయింది, ఇప్పుడు ఇరాన్పై జరిపిన అమెరికా దాడిని ఖండించగలదని ఎవరైనా ఎలా ఆశించగలరు?
అమెరికా యుద్ధచర్యను ఖండించాలి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES