నవతెలంగాణ-హైదరాబాద్: 24మంది విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఉపాధ్యాయుని విధుల నుండి తొలగించడంతో పాటు మూడు రోజుల పాటు కస్టడీ విధించినట్లు వెల్లడించారు. వివరాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్లో సిర్మౌర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నిందితుడు గణితశాస్త్రం బోధిస్తున్నాడు. 8వ తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయుని వేధింపుల గురించి పాఠశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు తమను అనుచితంగా తాకాడని 24 మంది విద్యార్థులు ప్రిన్సిపల్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులను ఒక సమావేశానికి పిలిపించారు. వారిలో చాలామందికి తమ పిల్లలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియదని తేలింది. అనంతరం పాఠశాల అధికారులు ఈ ఫిర్యాదును పాఠశాల లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా మూడు రోజుల కస్టడీ విధించినట్లు తెలిపారు. విద్యాశాఖ సైతం వెంటనే స్పందించిందని, నిందితుడు (శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ -టిజిటి)ని తక్షణమే సస్పెండ్ చేసిందని అధికారులు తెలిపారు. ‘తీవ్రమైన మరియు సున్నితమైన సమస్య’గా పేర్కొంటూ పాఠశాల డైరెక్టర్.. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని డిప్యూటీ డైరెక్టర్ను ఆదేశించారు.