నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం వరకూ కల్తీసారా ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 58కి పెరిగినట్లు కళ్లకురిచి జిల్లా కలెక్టర్ ఎమ్ఎస్ ప్రశాంత్ తెలిపారు. విళుపురం, కళ్లకురిచి, సేలం, పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలువురు బాధితులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన 11 మందిని సీబీసీఐడీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.