– మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్ బి ఫామ్పైన గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజరు కుమార్లపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్ను అపాయింట్మెంట్ కోరామని తెలిపారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
జీవో 46 బాధితులకు అన్యాయం : రాకేశ్ రెడ్డి
జీవో 46 బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోర్టులో కేసు 20 సార్లకుపైగా వాయిదా పడటం ప్రభుత్వ పుణ్యమేనని ఎద్దేవా చేశారు. అడ్వకేట్ జనరల్తో అబద్ధాలు ఆడిస్తూ, ప్రభుత్వమే దాటవేత ధోరణని అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఒత్తిడికి తలొగ్గి క్యాబినెట్ సబ్ కమిటీ ప్రెస్మీట్ పెట్టిందే తప్ప ప్రభుత్వానికి కనీస చలనం లేదని తెలిపారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని వర్గాలకు బీఆర్ఎస్ అండ : జి.దేవి ప్రసాద్
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని ఆ పార్టీ నేత జి.దేవి ప్రసాద్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాలకు రోడ్ల మీదకు వస్తున్నారని తెలిపారు. వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీజేపీ బొగ్గు గనులను వేలం వేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వేలంలో కాంగ్రెస్ పాల్గొంటూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నదని విమర్శించారు.