– యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దు : నిజామాబాద్ ఏసిపి రాజ వెంకటరెడ్డి
– యువత మత్తు పదార్థాలు వాడితే జీవి తం అంధకారమవుతుంది
– డాక్టర్. బి. కేశవులు.ఎండి. సైకియాట్రీ
– చైర్మన్ నేషనల్ యాంటీ డ్రగ్స్ సంస్థ
– (జూన్ 26) నేడు అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
నవతెలంగాణ-కంఠేశ్వర్ : ప్రపంచం కరోనా, యుద్ధాలు, వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతుంటే, మరో మౌన మహామారి డ్రగ్స్ వ్యసనం విశ్వరూపం దాల్చుతోంది. ఇది ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కూడా మింగేస్తోంది.
ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లేసిట్ ట్రాఫికింగ్ (International Day Against Drug Abuse and Illicit Trafficking) జరుపుకుంటారు. 1987లో ఐక్యరాజ్యసమితి దీనిని ప్రారంభించిందో ప్రత్యేక ఉద్దేశంతో ఒక డ్రగ్-ఫ్రీ సమాజాన్ని నిర్మించాలి అనే నినాదంతో ఈ రోజున వ్యసనాల బాధితులకు అవగాహన కల్పించడం, యువతను దుర్వినియోగం నుండి రక్షించడం, ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలను చైతన్యపరచడం ప్రధాన లక్ష్యం.
మాదకద్రవ్యాల వ్యసనం ఏమిటి..?
మాదకద్రవ్యాల వ్యసనం (డ్రగ్ అడిక్షన్) అనేది ఒక గంభీరమైన మానసిక మరియు శారీరక స్థితి. ఇది మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధిగా గుర్తించబడింది. దీన్ని మాదకద్రవ్య వినియోగ రుగ్మత (సబ్ స్టాండ్స్ యూస్ డిసార్డర్ – ఎస్ యు డి) అని కూడా పిలుస్తారు.మానసిక స్థితిని మార్చగలిగే రసాయన పదార్థాలను మాదకద్రవ్యాలు అంటారు. ఈ పదార్థాలు మానవ శరీరంలో శరీర-మెదడు సమన్వయాన్ని దెబ్బతీసి తాత్కాలికంగా ఊహాజనిత ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఇవి శారీరక నాశనాన్ని,మానసిక విపరీతాలను,కుటుంబ బంధాల విచ్ఛిన్నాన్ని, సామాజిక శిక్షను తెచ్చిపెడతాయి. నిషేధిత మాదకద్రవ్యాలు (ఇల్లీగల్ డ్రగ్స్)నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవి. ఇక చట్టబద్ధమైన పదార్థాలు, మద్యం (ఆల్కహాల్), నికోటిన్ (పొగాకు), నిద్ర మాత్రలు, ఉత్సాహ వృద్ధక మాత్రలు మొదలైనవి.
మాదకద్రవ్య వ్యసనం ఎందుకు..?
వాస్తవానికి డ్రగ్ వాడకం ఆరోగ్య సమస్య కాదు. ఇది ఒక మానసిక, సామాజిక, ఆర్థిక సంక్షోభానికి ప్రతిఫల రూపం. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగార్థులు, సాంకేతిక నిపుణులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. గెలవకపోతే తప్పుకాదన్న దృష్టికోణం పోయింది. సామాజిక మీడియా పోలికల యుగంలో యువత తాను తక్కువనిపించుకోవడం, అంగీకార కోసం మత్తు పదార్థాలవైపు మొగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గంజాయి, బ్రౌన్ షుగర్, హెరాయిన్ మొదలైనవి తీసినవారు, మస్తిష్కంలోని డోపమైన్ వ్యవస్థలో మార్పులు కారణంగా మళ్ళీ అదే స్థాయి ఆనందం పొందాలంటే మోతాదును పెంచాల్సి వస్తుంది. దీంతో పూర్తిగా మానసికంగా పరాధీనత ఏర్పడుతుంది. విద్యార్థులపై ప్రభావం, చదువులో వెనుకబడటం, మానసిక స్థిరత్వం కోల్పోవడం, ఆత్మహత్యల శాతం పెరగడం, క్యాంపస్లో నేరప్రవర్తనలు, సెక్సువల్ హరాస్మెంట్ పెరగడం, దుష్ట గుంపుల ప్రభావం పెరగడం కుటుంబాలపై ప్రభావం,తల్లిదండ్రుల అపరాధ భావన,ఆర్థికంగా దిగజారటం, కుటుంబ బంధాల విచ్ఛిన్నం, చిన్న పిల్లల భవిష్యత్తుపై మాయగింగ, సామాజిక ప్రభావం,నేరాల శాతం పెరుగుతుంది, హింసాత్మక సంఘటనలు, మహిళలపై దాడులు, డ్రగ్ మాఫియాల పుట్టుక, శాంతిభద్రతలు ముప్పు.
భారతదేశ పరిస్థితి, వాస్తవాలు….
యు ఎన్ ఓ డి సి (యునైటెడ్ నేషన్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి 35 కోట్లకు పైగా వ్యక్తులు డ్రగ్లను ఉపయోగించారు.60 లక్షల మందికి పైగా మృతిచెందారు. ఇక భారతదేశంలో డ్రగ్ వ్యసన బారిన పడిన యువత సుమారు 3.2 కోట్ల మంది (15–35 ఏళ్ల వయస్సు), హైదరాబాద్లో డ్రగ్ కేసుల పెరుగుదల 2021తో పోలిస్తే 2024లో 230% పెరుగుదల,డ్రగ్ వల్ల ప్రతి సంవత్సరం మరణాలు ప్రపంచవ్యాప్తంగా 6 లక్షలు,డ్రగ్ స్మగ్లింగ్కు పాల్పడే ప్రత్తి 10 మందిలో 3 మంది మహిళలు కొత్త ధోరణి
మన దేశంలో 18-30 ఏళ్ల యువతలో డ్రగ్ వినియోగం38%పంజాబ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఢిల్లీ – అత్యధిక ప్రభావిత రాష్ట్రాలు4 రాష్ట్రాలు, ప్రతి రోజు డ్రగ్ సంబంధిత అరెస్టులుసగటు 500, వార్షికంగా డ్రగ్ కారణంగా మరణాలుసుమారు 1.4 లక్షలు. 18–35 సంవత్సరాల మధ్య యువత ముఖ్యంగా గంజాయి, బ్రౌన్ షుగర్, డ్రగ్ మిక్స్ చేసిన సిరంజి మాదకాలు వాడుతున్నారు.పంజాబ్, మణిపూర్, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ ప్రధాన కేంద్రాలు.2024 నాటికి హైదరాబాద్లో నార్కొటిక్స్ కేసులు 200% పెరిగాయి.పెరుగుతున్న రేవ్ పార్టీలు, వర్సిటీ లెవల్లో గంజాయి వాడకం, హాయ్ కలిగించే టాబ్లెట్ల వినియోగం – ఇవన్నీ తీవ్ర ముప్పుగా మారాయి.
డ్రగ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి… ?
శిక్షల కఠినతకు లొంగని డ్రగ్ మాఫియా, ఎన్ డి పి ఎస్ చట్టం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టాండ్ యాక్ట్ (narcotic Drugs and Psychotropic Substances Act, 1985) ఉన్నా అన్వయించడంలో అసమర్ధత, రాజకీయ మద్దతు వల్ల మాఫియా శక్తులు పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే కొత్త ముఠాలు, డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీ, ఫేక్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ద్వారా పట్టుకోలేని విధంగా డ్రగ్ డీలింగ్ జరుగుతోంది. ప్రభుత్వాల అలసత్వం,పునరావాస కేంద్రాలు (రిహాబిటేషన్ సెంటర్స్) తక్కువ, మానసిక చికిత్సకు ప్రోత్సాహం లేదు. డ్రగ్ బాధితులను నేరస్థులుగా చూసే వ్యవస్థ ఇంకా మారలేదు.
వ్యసన నివారణ మార్గాలు….
వ్యక్తిగతంగా అవగాహన – డ్రగ్లు కలిగించే నష్టాలపై సకాలంలో అవగాహన కల్పించాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. సానుకూల వాతావరణంలో ఉండాలి. కుటుంబంగా పిల్లలతో అనురాగ సంబంధం పెంచాలి. వారిని గమనించాలి, మార్పులను వెంటనే గుర్తించాలి. హాస్య, వినోదం, సంస్కృతులు ప్రోత్సహించాలి. విద్యాసంస్థల్లో, నార్కొటిక్ అవగాహన శిబిరాలు నిర్వహించాలి.కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.ప్రతి విద్యార్థి మానసిక స్థితిని పరిశీలించాల్సిన బాధ్యత ఉండాలి. ప్రభుత్వ స్థాయిలో , ఐటీ, నార్కొటిక్ సెల్లు బలోపేతం, రిహాబిలిటేషన్ కేంద్రాలు పెంపు, డ్రగ్ ట్రాఫికింగ్పై గట్టి చట్టాలు, యువత కోసం “డ్రగ్-ఫ్రీ క్లబ్లు” ఏర్పాటు చేయాలి. డ్రగ్స్ మనకు తాత్కాలిక హాయి, శాశ్వత నాశనం ఇస్తాయి. ఒక్కసారి ప్రారంభిస్తే, తిరిగి తిరిగే మార్గం ఉండకపోవచ్చు. డ్రగ్లపై విజయం మనలోనే మొదలవుతుంది. నేను నా కుటుంబం నా సమాజం డ్రగ్-ఫ్రీగా ఉండాలని చూడాలి.మానవ జీవితాన్ని మత్తులో ముంచొద్దాం – మానవత్వంతో నిలబడుదాం! డ్రగ్స్ను కాదనండి జీవితాన్ని ఆమోదించండి!
యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి
మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా ఉండాలని, మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ ఏసిపీ రాజ వెంకటరెడ్డి తెలిపారు.
మాదకద్రవ్యాలు వల్ల జరిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో కళాశాలలో అవగాహన కార్యక్రమాలు, పోలీస్ కళాబృందం ద్వారా ప్రజలకు యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు వల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టాలిమాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల వినియోగం జీవితాలను చిత్తు చేసి నాశనం చేస్తాయని అన్నారు.యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు బానిసలై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని,మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా ఎక్కువైందని అనేకమంది బానిసలవుతున్నారని అన్నారు.మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉండాలి.యువత చెడు వ్యసనాల పట్ల ఆకర్శితులు కాకుండా ఆరోగ్యవంతమైన జీవితంపై ఆశలు పెంచుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తామని,డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పి, డ్రగ్స్కు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలకు సమీపంలో డ్రగ్స్, గంజాయి వంటవి విక్రయించిన, సేవించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
యువత మత్తు పదార్థాలు వాడితే జీవి తం అంధకారమవుతుంది
– డాక్టర్. బి. కేశవులు.ఎండి. సైకియాట్రీ.
చైర్మన్ నేషనల్ యాంటీ డ్రగ్స్ సంస్థ
తెలంగాణ రాష్ట్ర మేధావుల సంఘం.
యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమవుతుందని డాక్టర్. బి. కేశవులు.ఎండి. సైకియాట్రీ. చైర్మన్ నేషనల్ యాంటీ డ్రగ్స్ సంస్థ.
తెలంగాణ రాష్ట్ర మేధావుల సంఘం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకొంటాయన్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలోనే మత్తు బానిస అవుతారని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలపై అవగాహ పెంచుకొని గ్రామాల్లోని ప్రజలకు వాటి పరిస్థితి గురించి వివరించాలని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం నేటి యువతలో తీవ్ర సమస్యగా మారింది. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. యువత భవిష్యత్తు ఎంతో విలువైనది. అందుకే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.