హైదరాబాద్లో బోనాల సందడి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, భక్తి పారవశ్యానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో జరిగే పండగ సందడి మొదలవుతుంది. ఈ సంవత్సరం జూన్ 26తొలి పూజతో ప్రారంభమైన మహంకాళి బోనాలు, జూలై 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, సురక్షితంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
జూన్ 26వ తేదీన తొలి పూజతో ప్రారంభమైన గోల్కొండ మహంకాళి బోనాలు, జూలై 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమైన తేదీలలో.. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఈ మళ్లింపులు జూన్ 26, 29, జూలై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీలలో వర్తిస్తాయి. వాహనదారులు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ క్రింది మార్గాలను అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రాందేవ్ గూడ నుంచి మక్కా దర్వాజ మీదుగా గోల్కొండ కోట వెళ్లే మార్గం.. ఫతే దర్వాజా మీదుగా లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వెళ్లే మార్గం.. బంజారా దర్వాజా ద్వారా గోల్కొండ కోటకు 7 టూంబ్స్, షేక్పేట నాలా మీదుగా వెళ్లే మార్గం గుండా వాహనదారులు వెళ్లకపోవడం మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మళ్లింపులు సాధారణ ట్రాఫిక్ను తగ్గించి, భక్తులు ఆలయానికి సులభంగా చేరుకోవడానికి, ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి తోడ్పడతాయి. ట్రాఫిక్ పోలీసులు ఈ తేదీలలో ఆలయ పరిసరాల్లో పాదచారులకు, బోనాలు మోసుకుని వచ్చే భక్తులకు ప్రత్యేక మార్గాలను కేటాయించి, వారికి సురక్షితమైన రాకపోకలను నిర్ధారిస్తారు.