Saturday, June 28, 2025
E-PAPER
Homeజాతీయంఅది రాజ్యాంగ విరుద్ధం

అది రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -

– రాజ్‌భవన్‌లో భారతమాత చిత్రం ప్రదర్శనపై కేరళ సీఎం : రాష్ట్ర గవర్నర్‌కు విజయన్‌ లేఖ
తిరువనంతపురం:
కేంద్రంలోని మోడీ సర్కారు గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను సవాలు చేసే విధంగా గవర్నర్లతో సమాంతర పాలన జరపటం, రాజ్‌భవన్‌ కేంద్రంగా కాషాయపార్టీ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలను మోడీ సర్కారు చేస్తున్నదని ఆరోపణలున్నాయి. ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తున్నది. రాజ్‌భవన్‌లో భారతమాత చిత్రాన్ని ప్రదర్శించటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యను ‘రాజ్యాంగ విరుద్ధం’ అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌కు ఆయన లేఖ రాశారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో అలాంటి చిత్రాలను ఉపయోగించకూడదని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారిక చిహ్నం కాకుండా వేరే ఏదైనా చిహ్నాన్ని ఉపయోగించటం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తుందని సూచించే న్యాయ సలహాకు ప్రతిస్పందనగా విజయన్‌ ఈ లేఖ రాశారు. ఈ అంశం రాష్ట్ర క్యాబినెట్‌ ముందుకు రాగా.. విజయన్‌ తన ఆందోళనలను గవర్నర్‌కు అధికారికంగా తెలియజేశారు. ”భారతమాత చిత్రం రాజ్యాంగ విరుద్ధమనీ, దానిని ప్రభుత్వం అనుసరించకూడదని ముఖ్యమంత్రి లేఖ తెలియజేస్తున్నది. రాజ్యాంగానికి అనుగుణంగా లేని విషయాలపై గవర్నర్‌ పట్టుబట్టకూడదనేది ప్రభుత్వ వైఖరి” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశ ఐక్యతను ప్రతిబింబించే భారతమాత : గవర్నర్‌ స్పందన
విజయన్‌ లేఖకు గవర్నర్‌ స్పందించారు. భారతమాత అనేది ఏ రాజకీయపార్టీ సిద్ధాంతమో కాదనీ, అది దేశ ఐక్యతను ప్రతిబింబిస్తుందని రాజేంద్ర అర్లేకర్‌ పేర్కొన్నారు. భారతమాత.. కులం, రాజకీయాలకు అతీతంగా ఉద్భవించిందని వివరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమాన్ని విద్యా మంత్రి బహిష్కరించటం రాజ్యాంగ అధిపతికి జరిగిన అవమానంగా ఆయన అభివర్ణించారు. మంత్రి చర్య ప్రొటోకాల్‌ ఉల్లంఘనను ప్రదర్శించిందని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రభావితం చేసే పెద్ద వివాదంగా మారినందున తాను త్వరగా సమాధానమివ్వాలని నిర్ణయించుకున్నానని గవర్నర్‌ పేర్కొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు
గవర్నర్‌ చర్యలను మేధావులు సైతం తప్పుబడుతున్నారు. ఒక రాజకీయపార్టీ ఉపయోగించే చిత్రాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్‌ చర్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నది. రాజ్‌భవన్‌ ముందు ప్రదర్శనలను నిర్వహిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -