సరుకుగా మారిన చదువు : ప్రొఫెసర్ హరగోపాల్
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రయివేట్, కార్పొరేట్ విద్యావ్యవస్థలతో మానవ విలువలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోతున్నాయని, చదువు సరుకుగా మారిందని, దీనికి ప్రభుత్వాలే ద్వారాలు తెరిచాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విద్యను విధ్వంసం చేసే ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువులు సరుకులుగా మారటంతో సమాజం విషవృక్షంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నవాడు చదవనివారు ఒకే విధంగా ఉంటున్నారన్నారు.
కార్పొరేట్ విద్య వల్ల మానవీయత పూర్తిగా నశించిందన్నారు. తల్లిదండ్రులను చంపుతున్న పిల్లలు, పిల్లలను చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నా యన్నారు. చదువులో విలువలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. కమిటీ అధ్యక్షులు కె.చక్రధర్రావు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో కనీసం 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు విద్యకు కేటాయించాలని కోరారు. ఇంటర్నేషనల్ స్కూల్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని, 30 వేల పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సెమీరెసి డెన్షియల్స్గా మార్చాలని సూచించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బదులుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యాగాలు వచ్చే నైపుణ్యాలను నేర్పించాలన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెజి.రాంచందర్ మాట్లాడుతూ.. గతంలో ధనికులు పేదలు అన్న తేడా లేకుండా ఒకే పాఠశాలలో చదివే వాతావరణం ఉండేదని, కానీ పాలకులు కావాలనే ప్రభుత్వ విద్యను ధ్వంసం చేసి, ధనికులకు ఒక విద్య, పేదలకు మరో విద్య అందేలా ప్రయివేటు, కార్పొరేట్ విద్యారంగానికి ఊతమిచ్చారని విమర్శిం చారు. ఈ ధర్నాలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొ.లక్ష్మీనారాయణ, కమిటీ భాగస్వామ్య సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కనుమరుగవుతున్న మానవతా విలువలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES