నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర నిన్న (జూన్ 27న) ఘనంగా ప్రారంభమైంది. దీంతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం జగన్నాథుడు, దేవత సుభద్ర, బలభద్రుడి చెక్క విగ్రహాలను ఆలయం నుంచి రథాలపైకి ఎక్కించారు. ఆ తర్వాత రథాలను లాగడం ప్రారంభించారు. సాయంత్రం 4:08 గంటలకు బలభద్రుని తలధ్వజ రథం మొదట బయలుదేరింది. తర్వాత సుభద్ర దేవి దర్పదలన్ రథం, చివరకు జగన్నాథుని నంది ఘోష రథం బయలుదేరాయి.
ఈ సమయంలో భక్తుల నినాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. అదే క్రమంలో ప్రభువు బల భద్రుల రథాలను శ్రీగుండిచా ఆలయం వైపు లాగే క్రమంలో 500 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. పెరిగిన వేడి నేపథ్యంలో పలువురు భక్తులు మూర్ఛపోయారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఒడిశా ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్ తెలిపారు.
ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. గ్లూకోజ్, నీరు తగినంత పరిమాణంలో అందించామని ఆరోగ్య మంత్రి ముఖేష్ తెలిపారు. అనారోగ్యానికి గురైన వారి సంఖ్య ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్కడికక్కడే నడిచిన అంబులెన్సుల ప్రకారం 500 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ వేడుక భద్రత కోసం ఒడిశా పోలీసులతోపాటు కేంద్ర బలగాలు, ఎన్ఎస్జీ సహా దాదాపు 10,000 మంది సిబ్బందిని కేటాయించారు. దీంతో పాటు 275కి పైగా సీసీటీవీలను కూడా పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు.