– నాలుగు గేట్లలో రోప్వే సమస్య
– గత ప్రభుత్వంలో నిర్వహణలేని ప్రాజెక్టులు : నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
– మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి జూరాల, ర్యాలంపాడు రిజర్వాయర్ల పరిశీలన
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల /ధరూర్
జూరాల ప్రాజెక్టు సాంకేతికంగా పూర్తి భద్రంగా ఉందనీ, ప్రతి నీటిపారుదల ప్రాజెక్టునూ పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేట్ల వద్ద రోప్వే సమస్య ఏర్పడిన నేపథ్యంలో శనివారం పశుసంవర్థక, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ను ఉత్తమ్ సందర్శించారు. జూరాల గేట్ల వద్ద ఏర్పడిన సమస్యలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా పని చేస్తున్నాయనీ, తాత్కాలికంగా నాలుగు గేట్లకు రోప్వే సమస్య తలెత్తినప్పటికీ, దాని వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిపారు. గతంలో ఎన్నో భారీ వరదలను జూరాల డ్యామ్ ఎదుర్కొందని, ఇప్పుడు ప్రభుత్వం పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటోందని అన్నారు. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రస్తుతం పాత తప్పిదాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఇరిగేషన్లో ఆపరేషన్ మెయింటెన్స్ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాలు వెళ్లడాన్ని గతంలోనే నిషేధించేలా సాంకేతిక నివేదికలు ఇచ్చినప్పటికీ, గత ప్రభుత్వ పాలనలో పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సమస్య తీవ్రతను గుర్తించి, జూరాల ఆవరణలో ఆల్టర్నేట్ రోడ్, వాహనాల వంతెన కోసం రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. జూరాల, మంజీరా, నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రొటీన్ మెయింటెనెన్స్ చేపట్టి భవిష్యత్లో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
అసత్యాల్ని నమ్మొద్దు : మంత్రి వాకిటి
జూరాల ప్రాజెక్టు ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని నిలబడిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. 2009లో వచ్చిన భారీ వరదల సమయంలోనూ రోజుకి 12 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, అయినా ప్రాజెక్టు ఏమాత్రం నష్టాన్ని ఎదుర్కోలేదని అన్నారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి అసత్యాల్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతం సస్యశ్యామలం : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
జూరాల ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సాగునీటి లభ్యత పెరిగిందనీ, ర్యాలంపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు రెండు నుంచి నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసే పనులను వేగవంతం చేయాలని అన్నారు. జూరాల ప్రాజెక్టు పైనుంచి భారీ వాహనాలు వెళ్లకుండా, రాకుండా రోడ్డుకు బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు :రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి
కర్నాటక రాష్ట్రంతో సమన్వయం జరిపి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే నీటి నిల్వ సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ బియం.సంతోష్, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఇంజినీర్-ఇన్-చీఫ్ ఓ అండ్ ఏం.శ్రీనివాస్, డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్ టి.ప్రమీలా, వనపర్తి చీఫ్ ఇంజినీర్ ఏ.సత్యనారాయణ రెడ్డి, గద్వాల సూపరింటెండింగ్ ఇంజినీర్ రహీం ఉద్దీన్ ఉన్నారు.
పూర్తిగా రీస్టోర్..
జూరాల ప్రాజెక్టును పూర్తిగా రీస్టోర్ చేసి, వాటి సామర్థ్యాన్ని పెంచే దిశగా డిసిల్టేషన్, సెడిమెంటేషన్ తొలగింపు పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ర్యాలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని నాలుగు టీఎంసీల వరకు పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రెండు టీఎంసీల వరకు మాత్రమే నీరు నిల్వ అవుతోందనీ, మిగతా రెండు టీఎంసీల సామర్థ్యం అమలైతే రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట రిజర్వాయర్కు భూసేకరణ పనులు వేగవంతం చేయడమే కాకుండా, జూరాల ఎడమ కాలువ ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నెట్టెంపాడు భూసేకరణ కోసం ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని, డిసెంబర్ 2025 లోపల వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు.