– రేపు మాపు అని ఊరింపు
– పీఎంకిసాన్తో కేంద్రం కొత్త పల్లవి
– ఇంకా ఖరారుకాని మార్గదర్శకాలు
– కౌల్దార్లకు ఇప్పుడే కాదని లీకులు
– వర్షాలతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతుల ఎదురుచూపు
అమరావతి : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘అన్నదాతా సుఖీభవ..’ అంతకంతకూ ఆలస్యమవుతోంది. రోజుకో ప్రకటనతో ప్రభుత్వం అన్నదాతలతో దోబూచులాడుతోంది. వర్షాలు మొదలు కావడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు పెట్టుబడుల కోసం ప్రభుత్వంకేసి చూస్తున్నారు. ప్రభుత్వం తొలుత మే నెలలో ఇస్తామని చెప్పి, అనంతరం జూన్కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. జూన్ 21న రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఢంకా భజాయించారు. ఆ గడువు ముగిసినా అన్నదాతా..పై ప్రభుత్వంలో కదలిక లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పీఎంకిసాన్ కిస్తు జమ చేస్తే, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సొమ్ము జమ చేస్తుందని మాట మార్చారు. కాగా పిఎంకిసాన్ కిస్తుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొదట్లో జూన్ చివరాఖరులోనన్నారు. ఇప్పుడు జులై అంటున్నారు. కేంద్రం పీఎంకిసాన్ విడుదల చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం స్వంత భూమి కలిగిన రైతులకే పీఎంకిసాన్ సాయం చేస్తోంది. కౌలు రైతులకు రాష్ట్ర ఖజానా నుంచి మొత్తం నిధులూ భరిస్తామని కూటమి సర్కారు హామీ ఇచ్చి, కౌలు రైతులకు భూయజమానులతో కాకుండా ఎప్పుడో అక్టోబర్, జనవరిలో రెండు వాయిదాల్లో సాయం చేస్తామంటోంది.
గైడ్లైన్స్ లేకుండా…
టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన ‘సూపర్ సిక్స్్’ హామీలలో అన్నదాతా.. ఒకటి. రైతులు, కౌలు రైతులు సేద్యం సాగించేందుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. అధికారంలోకొచ్చాక తొలేడాది ఇవ్వలేదు. రెండవ సంవత్సరం నుంచి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికిమల్లే ఏడాదిలో మూడు విడతల్లో, కేంద్ర పథకం పీఎంకిసాన్తో కలిపి అమలు చేస్తామని చెబుతున్నారు. కౌలు రైతులకు మొత్తం నిధులూ రాష్ట్రమే భరిస్తుందన్నారు. ఇవన్నీ మాటలే తప్ప ఇప్పటి వరకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు. అయినప్పటికీ అన్ని లక్షల మంది, ఇన్ని లక్షల మంది అని సర్కారు నుంచి ప్రకటనలు జారీ చేసి మరింత గందరగోళానికి కారణమవుతున్నారు. తాజాగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ 47.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించి ఇ-కెవైసి పరిశీలనకు పంపామన్నారు. వెరిఫికేషన్ 98 శాతం పూర్తయిందంటున్నారు తప్ప ఎంత మందిని తిరస్కరించారో వెల్లడించలేదు. అసలు విధి విధానాలు రాకుండా ఏ ప్రాతిపదికన
అర్హులను గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. పిఎంకిసాన్కు కేంద్రం నిర్ధారించిన నిబంధనలనే ఖరారు చేస్తారని తెలుస్తోంది. కేంద్రం ఇ-కెవైసి సహా పలు నిబంధనలు విధించింది. స్వంత భూమి కలిగిన వారికే ఇస్తోంది. తమ మాటేమిటని కౌలు రైతులు ఆందోళనగా ఉన్నారు. కౌలు రైతుల గుర్తింపునకు సిసిఆర్సి చట్టం ఆటంకంగా ఉంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం అంగీకరించి కొత్త చట్టం తెస్తామని ప్రకటించింది. ఏడాదైనా అతీగతీ లేదు. గుర్తింపు కార్డు, ఇ-పంటలో నమోదు తప్పనిసరి చేసినట్లు చెబుతున్నారు. పాత చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తే నామమాత్రపు సంఖ్యకే అన్నదాతా.. లబ్ధి చేకూరుతుంది.
కోతలే కోతలు
కేంద్రం పీఎంకిసాన్కు విధించిన ఆంక్షలతో లబ్ధిదారులు అంతకంతకూ తగ్గిపోతున్నారు. 2024-25లో కేంద్రం రెండు వేల చొప్పున మూడు కిస్తులు జమ చేయగా లబ్ధిదారుల సంఖ్య ఒక్కో విడతలో 41 లక్షలకు మించలేదు. గత వైసిపి ప్రభుత్వం తన వాటా కింద దాదాపు 50 లక్షల మంది స్వంత భూమి దారులకు సొమ్ము జమ చేసింది. పది లక్షల మంది తగ్గిపోయారు. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు లబ్ధి లక్ష లోపుగానే ఉంది. పాత చట్టం, పాత నిబంధనలే ఇప్పుడూ అమలయ్యేటట్లయితే వాస్తవంగా భూమిపై సాగు చేస్తున్న అర్హులైన రైతులు, కౌలు రైతులందరికీ సర్కారీ సాయం అందే పరిస్థితి లేదు.