నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ లో క్లౌడ్బరస్ట్ కారణంగా.. భక్తుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు ఛార్ధామ్ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలామంది దివ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. అయితే, భద్రతా కారణాల వల్ల యాత్రికులను హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్నగర్ వంటి ముఖ్య పట్టణాల్లో నిలిపివేయాలని పోలీసులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. వాతావరణం అనుకూలించిన తరువాతే ఛార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.
అలాగే పౌరి, టెహ్రీ, రుద్రప్రయాగ్, చమోలీ, ఉత్తరకాశి, అల్మోరా జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని, నదుల ఒడ్లకు వెళ్లకూడదని ప్రభుత్వం కోరింది. భద్రతా పరంగా SDRF బృందాలు అప్రమత్తంగా ఉండి, అత్యవసర సమయంలో సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ప్రమాద సంకేతాలు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని అధికార ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.