Monday, June 30, 2025
E-PAPER
Homeజాతీయంరైతుల హక్కుల రక్షణకు పోరాటాలు తీవ్రతరం

రైతుల హక్కుల రక్షణకు పోరాటాలు తీవ్రతరం

- Advertisement -

– ఎఫ్‌టీఏలు దేశీయ రైతుల జీవనోపాధికి ముప్పు
– కేరళలోని కన్నూర్‌లో ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సమావేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

రైతుల హక్కుల రక్షణకు పోరాటాలను తీవ్రతరం చేయాలని ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావలే పిలుపునిచ్చారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) కేంద్ర కమిటీ సమావేశం ఆదివారం కేరళలోని కన్నూర్‌లో ఈకే నాయనార్‌ అకాడమీలో ప్రారంభమైంది. తొలిత ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావలే జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశంలోని రైతుల కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాలను గౌరవిస్తూ సభ్యులందరూ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆహ్వాన కమిటీ చైర్మెన్‌ ఈపీ జయరాజన్‌ స్వాగత ప్రసంగం చేశారు. అశోక్‌ ధావలే అధ్యక్ష ప్రసంగం చేస్తూ ఉద్యమం ముందున్న కీలకమైన రాజకీయ సవాళ్లను, లక్ష్యాలను వివరించారు. రైతులు, శ్రామిక ప్రజలపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతులను సమీకరించాల్సిన అవసరాన్ని, కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) సంయుక్తంగా జులై 9న నిర్వహించే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రైతులు, వ్యవసాయ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ ముసాయిదా నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిణామాలను వివరించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులను పట్టి పీడిస్తున్న తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని విశ్లేషించారు. జులై 9 నాటికి సంతకం చేయనున్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), అమెరికాతో రాబోయే ఒప్పందంపై నివేదిక విమర్శనాత్మకంగా ప్రస్తావించారు. ఈ ఎఫ్‌టీఏలు కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గిస్తాయని, కొన్ని సార్లు తొలగిస్తాయని తెలిపారు. ఇది లక్షలాది మంది దేశీయ రైతుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.
కన్నూర్‌లో జరిగే ఈ సమావేశంలో రైతుల హక్కుల రక్షణలో పోరాటాలను తీవ్రతరం చేయడానికి, కార్పొరేట్‌ అనుకూల విధానాలను నిరోధించడానికి, ప్రస్తుత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పాలన ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి కార్మికవర్గంతో ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి వ్యూహాలపై వివరంగా చర్చించనున్నారు. దాదాపు 75 మంది కేంద్ర కమిటీ సభ్యులకు కేరళ కర్షక సంఘం (ఏఐకేఎస్‌ రాష్ట్ర విభాగం) ఘన స్వాగతం పలికింది. కేంద్ర సభ్యులు ఉత్తర కేరళలోని భూస్వామ్య, బ్రిటిశ్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రైతుల ప్రతిఘటనకు దారితీసిన చారిత్రక ప్రదేశాలు కరివెల్లూర్‌, కయ్యూర్‌లను సందర్శించారు. ఈ ప్రాంతాలు దేశంలోని రైతు ఉద్యమ చరిత్రలో గర్వించదగిన వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రతినిధి బృందం చారిత్రాత్మక బేకల్‌ కోటను కూడా సందర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -