Monday, June 30, 2025
E-PAPER
Homeజాతీయంత్రిభాషా విధానంపై వెనక్కి

త్రిభాషా విధానంపై వెనక్కి

- Advertisement -

– ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయం
ముంబయి: ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలందరికీ హిందీ విధిగా బోధించాలని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో.. తాజాగా వెనక్కి తగ్గింది. త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విధానంపై ఎలా ముందుకెళ్లాలి, దాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై విద్యావేత్త నరేంద్ర జాదవ్‌ నేత ృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు.”ఒకటో తరగతి నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి సంబంధించి ఏప్రిల్‌, జూన్‌లలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విధానం అమలుపై సిఫారసులు చేసేందుకు డా.నరేంద్ర జాదవ్‌ నేత ృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం” అని ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఫడ్నవీస్‌ తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని డా.రఘునాథ్‌ మషేల్కర్‌ కమిటీ చేసిన సిఫారసులను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే అంగీకరించారని, దాని అమలుపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని గుర్తుచేశారుజాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. ఈ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఇంగ్లీష్‌, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1-5 తరగతుల విద్యార్థులకు హిందీని మూడో భాషగా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత ఏప్రిల్‌ 16న ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. హిందీని ఆప్షనల్‌గా మారుస్తూ సవరణ ఉత్తర్వు జారీ చేసింది. అయినా.. ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు కొనసాగాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన’ (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేలు ఏకం కానున్నారనే చర్చ మొదలైంది. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో వచ్చే నెల 5న శివసేన యూబీటీ, ఎంఎన్‌ఎస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న నిరసనను రద్దు చేస్తున్నట్టు సంజరు రౌత్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -