– ఇజ్రాయిల్కు ఇరాన్ హెచ్చరిక
టెహరాన్: కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంలో ఇజ్రాయిల్ నిబద్ధతపై పలు అనుమానాలు ఉన్నాయని ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి అన్నారు. ఆ దేశం ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి దాడులు చేస్తే, దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సౌదీ అరేబియా రక్షణశాఖ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్తో ఆదివారం జరిగిన భేటీ సందర్భంగా మౌసావి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభించలేదనీ, కేవలం ఇజ్రాయిల్ దాడులకు పూర్తి స్థాయిలో ప్రతిస్పందించామని అన్నారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆ ఒప్పందాన్ని ఇరు దేశాలు పాటిస్తున్నా, పరస్పర అనుమానాలు, ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
హమాస్తో ఒప్పందం చేసుకోండి : ఇజ్రాయిల్కు ట్రంప్ సూచన
గాజాలో హమాస్తో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ను కోరారు. యుద్ధాన్ని ముగించి, సంధి కుదుర్చుకోవా లన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. గాజాతో ఒప్పందం చేసుకొని, బందీలను వెనక్కి తీసుకురావాలని ఇజ్రాయిల్కు సూచించారు. గాజాలో కూడా కాల్పుల విరమణ పాటించాలని ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనిపై ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై ఆయన ఒత్తిడి పెంచారు. గాజాతో వచ్చేవారం సంధి కుదురుతుందని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఒప్పందం కుదుర్చుకోమంటూ సోషల్ మీడియాలో మళ్లీ పోస్ట్ పెట్టారు. అదే సమయంలో నెతన్యాహుపై కేసులను వదిలేయాలని ఇజ్రాయిల్ ప్రాసిక్యూటర్లను అభ్యర్థించారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్కు ఆమెరికా సహాయాన్ని గణనీయంగా పెంచింది. వాషింగ్టన్ నుంచి ప్రపంచంలో మరే దేశానికి అంత స్థాయిలో ఆర్థిక సాయం అందలేదు.