– ఆయుధాలు పట్టుకున్న వారితో చర్చల్లేవ్
– ఉగ్రదాడులకు మోడీ హయాంలో దీటైన జవాబు
– గతంలో దాడులు చేసినా కాంగ్రెస్ ఏమీ చేయలేదు
– పసుపు బోర్డుతో పాటు ఎక్స్పోర్ట్, ఆర్గానిక్ లిమిడెట్ బ్రాంచులు
– నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తాం : పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలి. సరెండర్ అయ్యేవారుంటే అవ్వండి. లేకుంటే 2026 వరకు మేమే నక్సలిజాన్ని అంతమొందిస్తాం. ఆయుధాలు పట్టుకున్న వారితో ఎట్టి పరిస్థితుల్లో చర్చల్లేవ్’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపుబోర్డు కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనం సభలో ఆయన మాట్లాడారు.
2014 కంటే ముందు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మనవారిని కాల్చి వెళ్లిపోతుండేవారని.. ఎవరూ స్పందించేవారు కాదన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఉగ్రదాడులకు దీటైన జవాబు ఇస్తున్నామని తెలిపారు. వారు ‘ఉరి’లో అటాక్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేశామని, పుల్వామాలో ఎయిర్స్ట్రైక్తో, పహల్గాంలో ఆపరేషన్ సిందూర్తో నేరుగా ఉగ్రస్థావరాలనే మట్టుబెట్టామని తెలిపారు. ఈ దాడులతో మన బలమెంతో పాకిస్తాన్కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక సురక్షిత భారత్ కోసం సంకల్పించారని, అందుకే అటు ఉగ్రవాదంతో పాటు నక్సలిజాన్ని అంతం చేస్తున్నామని తెలిపారు. ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటూ వారి మరణాలకు కారణమవుతున్న మావోయిస్టులను అంతం చేద్దామా.. వద్దా.. అని సభాసదులను ఉద్దేశించి అడిగారు. వారిని చంపొద్దని తెలంగాణ నుంచి కొందరు అంటున్నారని, మావోయిస్టులు అటు పోలీసులను, ఇటు అమాయకులైన ఆదివాసులను చంపుతున్నారని, వారి కుటుంబాలకు ఏం జవాబు చెప్తారని ప్రశ్నించారు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్న మావోయిస్టులను 2026 కల్లా అంతమొందించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 10 వేల మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.
ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక పనుల్లో కమీషన్ దందా నడిపిందని, కాళేశ్వరం పనుల్లో అనేక అవకతవకలకు పాల్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారిపై ఏమైనా చర్యలు తీసుకుందా అని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణను గతంలో కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా వాడుకుందని.. ప్రస్తుతం కాంగ్రెస్.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఎక్స్పోర్ట్, ఆర్గానిక్ లిమిటెడ్ బ్రాంచులు ఇక్కడే..
40 ఏండ్ల పసుపు రైతుల కలను సాకారం చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మోడీ ఏదైతే చెప్తారో అది ఆచరణలో చేసి చూపిస్తారన్నారు. అధిక విస్తీర్ణంలో పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలో బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు, ఇదే జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డిని బోర్డు చైర్మెన్గా నియమించామని తెలిపారు. పసుపు బోర్డుతో పాటు భారత్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానికి లిమిటెడ్ బ్రాంచీలు సైతం ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అమెరికా, కెనడా, యూరప్ లాంటి ప్రపంచ దేశాలకు పసుపును ఎగుమతులు చేసి రైతుల ఆదాయం పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మెన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి, పసుపు బోర్డు వైస్ చైర్మెన్ భవాని, ఇతర ఉన్నతాధికారులు, కార్పొరేషన్ల చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.
నక్సలిజాన్ని అంతమొందిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES