Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆదేశాలు అమలు చేయకుంటే సీఎస్‌ కోర్టుకు రావాలి : హైకోర్టు

ఆదేశాలు అమలు చేయకుంటే సీఎస్‌ కోర్టుకు రావాలి : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ అగ్నిమాపక సేవల చట్టం 1999 కింద కొత్త నిబంధనలను ఎందుకు రూపొందించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జులై 16లోగా రూపొందించాలని ఆదేశించింది. లేనిపక్షంలో ఆ రోజు జరిగే విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) హాజరుకావాలని సోమవారం జస్టిస్‌ సామ్‌కోషి, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌ 21 విచారణ స్రమయంలో నిబంధనలు రూపొందించాలని ఆదేశించినా ప్రభుత్వం చేస్తామని చెప్పి ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల గడువు కోరడాన్ని తప్పుపట్టింది. తెలంగాణ అగ్నిమాపక సేవల చట్టం 1999 కింద కొత్త నిబంధనలను రూపొందించలేదంటూ హైదరాబాద్‌ నాచారానికి చెందిన పి గోవింద్‌ ఇతరుల పిటిషన్‌పై విచారణను డివిజన్‌ బెంచ్‌ వాయిదా వేసింది.

మోడల్‌ స్కూళ్ల మెమోలపై స్టే
మోడల్‌ స్కూళ్లలో పనిచేసే పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 అమలు చేసేందుకు వీలుగా విద్యాశాఖ ఇచ్చిన మెమోల అమలు నిలిపేస్తూ హైకోర్టు స్టే ఆర్డర్‌ జారీ చేసింది. తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సొసైటీలోని పోస్టులను కొత్త జోనల్‌ క్యాడర్లుగా విభజించి, రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం ఉద్యోగులను కేటాయిస్తూ రాష్ట్ర విద్యా శాఖ, పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం రెండు మెమోలను జారీ చేశాయి. వాటిని నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్‌పాడు మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు సైదులు ఇతరులు సవాల్‌ చేసిన పిటిషన్లను డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. రెండు మెమోలపై స్టే ఇచ్చింది. విచారణను వాయిదా వేసింది.

అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాలి
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్‌ వినతిపత్రంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ తాలూకా ఖానామెట్‌లోని తమ భూమిలో రాయపాటి ప్రతిభ ఇతరులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనే వినతిపత్రంపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవడం లేదంటూ సయ్యద్‌ రహీమున్సిసా ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి సోమవారం విచారించారు. నోటీసులు ఇచ్చి కూల్చివేత చర్యలు తీసుకోరనీ, చర్యలు లేకపోవడంపై ప్రశ్నిస్తే తమ బాధ్యత కాదంటూ ఎవరికివారే తప్పించుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర విధ్వంసానికి బాధ్యులైన వాళ్ల చిత్రాలను ట్యాంక్‌బండ్‌పై అందరికీ కనబడేలా పెట్టాలని వ్యాఖ్యానించింది.

వాళ్లకు తరగతులు నిర్వహించాలి
జీహెచ్‌ఎంసీ వేసే పన్ను రూ.28 లక్షలైతే వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.71 లక్షలకు పెరిగేందుకు కారణమైన పిటిషనర్‌ మూడు రోజుల్లో రూ.ఐదు లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా పన్నుపై వడ్డీ లెక్కించే విధానం ఏమిటో చెప్పాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. అధికారులు, పిటిషనర్‌కు అంతర్జాతీయ ఎకనామిక్స్‌ వర్సిటీలో తరగతులు నిర్వహించాలని వ్యాఖ్యానించింది. విచారణ ఈనెల 16కు వాయిదా వేస్తూ జస్టిస్‌ విజరుసేన్‌రెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. సోమాజిగూడలోని వాణిజ్య భవనంలో ఈ ఫ్లాట్‌ ఉంటే దాని విస్తీర్ణం ఎక్కువగా చూపించి పన్ను వేస్తున్నారంటూ పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదించారు.

గ్రూప్‌-1పై హైకోర్టులో వాదనలు
గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరీక్ష నిర్వహణ, పరీక్షకు హాజరైన అభ్యర్థుల లెక్కలపై అనుమానాలున్నాయని పలువురు వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. గ్రూప్‌-1 మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అక్టోబరు 27న 21,093 మంది, తర్వాత క్రీడల కోటా కింద ఉన్న 17 మందితో కలిపారనీ, అది 21,110కి చేరిందనీ, ఆ తర్వాత 21,093 అని ఒకసారి 21,085 అని మరోసారి సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించడంపై సందేహాలున్నాయని న్యాయవాది చెప్పారు. గ్రూప్‌-1 పరీక్షలపై వాదనలు మంగళవారమూ కొనసాగనున్నాయి.

విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కేసుల విచారణ సందర్భంగా న్యాయవాదుల పట్ల జస్టిస్‌ మౌసమీ భట్టాచర్య వ్యవహారశైలిపై హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం మేరకు సోమవారం ఆమె విచారణ జరిపిన బెంచ్‌లో కేసుల విచారణకు న్యాయవాదులు దూరంగా ఉన్నారు. జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ బిఆర్‌ మధుసూదన్‌రావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపిన కేసుల విచారణకు న్యాయవాదులు హాజరుకాలేదు. ఇద్దరు న్యాయవాదులు ఆన్‌లైన్‌లో విచారణకు హాజరై తమ కేసులను వాయిదా వేయాలని కోరారు. ఇతర కేసుల్లో న్యాయవాదులు హాజరుకాకపోవడంతో వాటిని వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -