Tuesday, April 29, 2025
Navatelangana
Homeఅంతర్జాతీయంమరోసారి లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దళాలు భీక‌ర దాడి

మరోసారి లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దళాలు భీక‌ర దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌ దళాలు మరోసారి లెబనాన్‌పై విరుచుకుపడ్డాయి. ఆదివారం బీరుట్‌ దక్షిణశివారు ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ జెట్‌లు బాంబుల వర్షం కురిపించాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ చేసిన మూడవ దాడి ఇది. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనీస్‌ గ్రామమైన హల్టాలో జరిగిన డ్రోన్‌ దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే హిజ్బుల్లా సభ్యుడు లక్ష్యంగా దాడులు జరిపామని, అతను మరణించాడని ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. దాడి అనంతరం ఆ ప్రాంతమంతటా భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. రెండు భవనాల మధ్య ఉన్న లోహపు గుడారం వంటి నిర్మాణంపై మూడు బాంబులు పడినట్లు స్థానిక మీడియా జర్నలిస్ట్‌ వెల్లడించారు. పూర్తిగా దగ్ధమైన రెండు ట్రక్కుల ఫోటోలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రాణనష్టంపై నివేదికలు విడుదల కావాల్సి వుంది.
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకి చెందిన జిపిఎస్‌తో కూడిన క్షిపణుల నిల్వలపై దాడులు చేసిసనట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. అటువంటి పరికరాలను నిల్వ చేయడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.

దాడికి గంట ముందు ఇజ్రాయిల్‌ హెచ్చరికను జారీ చేసింది. హదత్‌ ప్రాంతంలోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రకటించింది. నివాసితులు ఆప్రాంతం నుండి దాదాపు 300 మీటర్ల దూరం తరలి వెళ్లాలని హెచ్చరించింది. బీరుట్‌పై దాడికి ముందు అల్‌-జామస్‌ పరిసరాల సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో యుద్ధవిమానాల సైరన్‌లు వినిపించాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. స్థానికులను హెచ్చరించేందుకు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని అన్నారు. పలు కుటుంబాలు ప్రాణ భయంతో పరుగులు తీశారని అన్నారు.

ఇజ్రాయిల్‌ దాడిని లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ ఔన్‌ ఖండించారు. కాల్పుల విరమణకు హామీ ఇచ్చిన అమెరికా, ఫ్రాన్స్‌లు ఈ దాడికి సమాధానమివ్వాలని అన్నారు. దాడులను నిలిపివేయాల్సిందిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ నిరంతర దాడులు స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ఈ ప్రాంతం మరిన్ని దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకునేవారిలో ఈ దాడి భయాందోళనలు సృష్టించిందని యుఎన్‌ సమన్వయకర్త జీనిన్‌ హెన్నిస్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని, యుద్ధాన్ని ముగించిన యుఎన్‌ తీర్మానం అమలును మరింత దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆమె కోరారు.

అమెరికా మధ్యవర్తిత్వంతో గతేడాది నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలపై ఆదివారం జరిగిన దాడి మూడవదని లెబనాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దాడి మార్చి 28న జరగగా, రెండవ దాడి ఏప్రిల్‌ 1న జరిగింది. ఏప్రిల్‌ 1న జరిగిన అప్రకటిత దాడిలో హిజ్బుల్లా అధికారి సహా నలుగురు మరణించినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత నుండి ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 190 మంది మరణించారని, 485 మంది గాయపడ్డారని లెబనాన్‌ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయిల్‌ హిజ్బుల్లా అధికారులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు