నవతెలంగాణ-హైదరాబాద్: 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. యాక్సియం-4 మిషన్ భాగంలో ఇండియన్ వ్యోమగామి శుభాన్ష శుక్లా చేపట్టిన అంతరిక్ష యాత్రకు నేటితో వారం రోజులు పూర్తి చేసుకుంది. అమెరికా, పోలాండ్, హంగేరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములతో కలిసి శుభాంశు శుక్లా రోదసియాత్ర జూన్ 25న చేపట్టారు.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైంది.
యాక్సియం-4 మిషన్ ప్రయోగం.. మొదట మే 29న ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక, వాతావరణ కారణాలతో జూన్ 8కి వాయిదా పడింది. తిరిగి జూన్ 10, జూన్ 11, జూన్ 12కి వాయిదా పడింది. స్పేష్ ఎక్స్ అంతరిక్ష నౌకలో లీక్ కారణంగా ప్రయోగం తిరిగి జూన్ 19కి వాయిదా పడింది. మళ్లీ అనివార్య కారణాల చేత జూన్ 22కి వాయిదా పడగా.. తిరిగి జూన్ 25న యాత్ర ప్రారంభమైంది. శుభాంశు బృందం 14 రోజుల పాటు అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు.