క్రీడాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించండి
2036 ఒలింపిక్స్లో రెండు ఈవెంట్స్ తెలంగాణలో నిర్వహించండి
క్రీడాకారులకు రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి : కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఖేలో ఇండియా గేమ్స్-2026ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సోమవారం నాడిక్కడ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను ఆయన అధికారిక నివాసంలో సీఎం ఎ.రేవంత్ రెడ్డి కలిశారు. ఖేలో ఇండియా కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణుల ఎంపిక ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేట్లో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్బీ స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్బాల్ ఫీల్డ్ అభివృద్ధి, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ నవీకరణ, నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్ని విధాలా కృషి చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని కోరారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్లో కనీసం రెండు ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు
తెలంగాణలో సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం కపిల్ దేవ్కు వివరించారు. అలాగే దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో సందర్శించిన క్రీడా యూనివర్శిటీలు, అక్కడి క్రీడా ప్రముఖులతో భేటీ అయిన వివరాలను కపిల్ దేవ్కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కపిల్దేవ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామినవుతానని తెలిపారు.
ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అజరుదేవ్గన్ విజ్ఞప్తి
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజరు దేవగన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో ఆయన కలిశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అజరు దేవ్గన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజరు దేవగన్ తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.