నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న తలపెట్టిన ‘రైల్ రోకో’ను విజయవంతం చేస్తామన్నారు. ఆ రోజు డెక్కన్ నుంచి ఢిల్లీ వైపు ఒక్క రైలును కూడా కదలనివ్వబోమని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీసీ వ్యతిరేకత పాతుకుపోయిందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఓబీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఇప్పుడు బీసీ వర్గాలకు న్యాయం చేసే గొప్ప అవకాశం వచ్చిందని కవిత అన్నారు. తెలంగాణ పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించేలా ఆయన చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(డి) ప్రకారం, పెంచిన రిజర్వేషన్లను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని, కేవలం ఒక జీవో జారీ చేస్తే సరిపోతుందని ఆమె గుర్తుచేశారు. ఇదే క్రమంలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయబోదని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కవిత స్పష్టం చేశారు.