నవతెలంగాణ-హైదరాబాద్: నలుగురు ప్రముఖుల పేర్లలను రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నామినేట్ చేశారు. ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష వర్థన్ ష్రింగ్లా తో పాటు సామాజిక కార్యకర్త సి సదానందన్ మాస్టర్, చరిత్రకారిణి మీనాక్షి జైన్లను పెద్దల సభకు నామినేట్ చేశారు.
గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల పదవీ విరమణ తర్వాత కొత్త నామినేషన్లు వస్తాయని గెజిట్ నోటిఫికేషన్ పేర్కొంది. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయవచ్చు. సాహిత్యం, సైన్స్, కళ సామాజిక సేవా రంగాలకు రాణించిన వారిని ఈ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రపతి కోటాలో నాలుగు స్థానాలకు వారిని ఎంపిక చేశారు.
ఉజ్వల్ నికమ్(72)- 1993 ముంబై పేలుళ్లు, 26/11 దాడులు వంటి కీలక ఉగ్రవాద కేసులపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. సంగీత దిగ్గజం గుల్షన్ కుమార్, బీజేపీ ప్రముఖుడు ప్రమోద్ మహాజన్ హత్య కేసులను కూడా ఆయన విచారించారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుండి ఆయన పోటీ చేశారు. కానీ ఆయన కాంగ్రెస్కు చెందిన వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు. ఉజ్వల్ నికమ్కు 2016లో పద్మశ్రీ లభించింది.
హర్ష వర్థన్ ష్రింగ్లా– జనవరి 2020 ఏప్రిల్ 2022 మధ్య విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. 2023లో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన G20 శిఖరాగ్ర సమావేశానికి ఆయన చీఫ్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. గతంలో, ఆయన అమెరికాలో భారత రాయబారిగా, బంగ్లాదేశ్లో హైకమిషనర్గా పనిచేశారు.
సి సదానందన్ మాస్టర్- కేరళకు చెందిన ఒక విద్యావేత్త, కార్యకర్త. ఆయన 2016 కేరళ ఎన్నికల్లో కుతుపరంబ నుంచి పోటీ చేసి, మూడో స్థానంలో నిలిచారు.
మీనాక్షి జైన్- ఒక రాజకీయ శాస్త్రవేత్త, చరిత్రకారిణి, విద్యా రంగానికి ఆమె చేసిన కృషికి గాను 2020 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆమె గతంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా కూడా పనిచేశారు.