‘ఇప్పుడంతా మారిపోయింది, అందరూ కలిసి తింటున్నారు, కలిసి తిరుగుతున్నారు, హోటళ్లలో, జాత రల్లో, ఉత్సవాల్లో అన్నింట్లో కలిసే ఉంటున్నారు. ఇంకెక్కడుంది కుల వివక్ష?’ ఈ మధ్యకాలంలో ఇలాంటి వాదనలు తరచూ వినిపిస్తున్నాయి. దేశం చాలా మారిం దంటున్నారు. వివక్ష లేనేలేదం టున్నారు. కానీ, నేటికీ కులజాఢ్యం అణగారిన ప్రజల్ని పట్టి పీడిస్తూనే ఉంది. పల్లెల్లో ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా ఇది కనిపిస్తూనే ఉంది. అయితే గతంలో ఉన్నంత మాదిరిగా ఇప్పుడు లేకపోవచ్చు, కానీ, కులవివక్ష రూపం మార్చుకుని మరో రూపంలో కొనసాగుతున్నది.శాస్త్ర, సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి సాధిస్తుంటే ఇదేం వివక్ష? అనుకోవచ్చు. దీన్ని స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా కొనసాగడానికి అగ్రవర్ణాల ఆధిపత్యంతో నడిచే ప్రభుత్వాలే కారణం.
దేశవ్యాప్తంగా చూస్తే మనరాష్ట్రంలోనూ దళితులపై దాడులు, దౌర్జన్యాలు, లైంగికదాడులు, సాంఘిక బహిష్కరణలు ఎక్కువే. పండగలు, ఉత్సవాల్లో ఈ వివక్ష పాటించబడుతున్నది. పెద్దకులాలతో కలిసి బతుకమ్మ ఆడనీయకపోవడం, దసరా పండుగ సందర్బంగా జమ్మిచెట్టు ఆకు దళితులు తెంపితే దాడి చేయడం, దళి తులకు క్షవరం చేయనియ్యకపోవడం, వారి బట్టలు ఉతకని పరిస్థితి ఉంది. గ్రామాల్లో రచ్చ బండల మీద కూర్చోనీయకపోవడం పాఠ శాలల్లో మధ్యాహ్న భోజనం వంటలపై వివక్ష పాటించడం, గుడిలోకి రానీయకపోవడం, హోటళ్లలో రెండుగ్లాసుల పద్ధతి, ఇంకా అనేక రూపాల్లో కులవివక్ష కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గుందిమల్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తోటి ఉపాధ్యాయులు భోజనం చేసే దగ్గర దళిత ఉపాధ్యాయుని పట్ల అంటరానితనం చూపించారు. అంటే ఇది చదువుకున్న వారిని సైతం ప్రభావితం చేస్తున్నది. సంగారెడ్డి మండలం ఎర్దనూరు గ్రామంలో పౌర హక్కుల దినం కార్యక్రమం నిర్వహించి అధికారుల సమక్షంలో దళితులను ఆలయ ప్రవేశం చేయిస్తే, ఆ గ్రామంలోని కొంతమంది పెత్తందారులు దళితులపై దౌర్జన్యానికి దిగడం కూడా అలాంటిదే. దీన్నిబట్టి గ్రామంలో మేం చెప్పిందే వినాలన్న ధోరణి ఇంకా నడుస్తున్నది. నారాయణఖేడ్, జహీ రాబాద్, అందోల్ ప్రాంతాల్లో నేటికీ దళితులకు ఆలయ ప్రవేశాలు లేవు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఇండ్లు శాఖహారులకు మాత్రమే అద్దెకిస్తారు. ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు ఇవ్వరు. పైగా ‘బ్రాహ్మణులకు మాత్రమే ఇల్లు కిరాయికి ఇవ్వబడును’ అని అగ్రకుల ఆధిపత్యం నింపుకున్న వ్యక్తులు తమ ఇంటి గోడలకు బోర్డులు పెడుతున్నారు.
నేటికీ అమలు చేయని జస్టిస్ పున్నయ్య సిఫారసులు
ఇలా అనేక కులవివక్షల్ని గుర్తించిన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఉమ్మడి ఏపీలో, నేడు తెలంగాణలో వేలాది మంది కార్యకర్తలతో, వందలాది గ్రామాల్లో సర్వేచేసింది. అంటరానితనం, కులవివక్ష, రెండుగ్లాసుల పద్ధతిపై అనేక పోరాటాలు నిర్వహించింది. దీంతో ప్రభుత్వమే నాడు దిగొచ్చి హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పున్నయ్యతో ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇది కేవీపీఎస్ సాధించిన విజయం. ఆ తర్వాత జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 128 రకాల కులవివక్షలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఆ వివక్షలన్నీ కమిషన్ ఏర్పడగానే అంతమయ్యాయా? అంటే లేదు. కమిషన్ ఏర్పాటు చేసిన పాలకులు దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి కదా! నేటికీ పున్నయ్య సిఫారసు చేసిన నలభై అంశాల్ని సర్కార్ పట్టించుకోవడం లేదు. ఫలితంగా నేటికీ కులవివక్ష రూపాలు కొన సాగుతున్నాయి.పున్నయ్య కమిషన్ సిఫారసుల్లో ప్రధానమైనవి చూస్తే వారంలో ఒకరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కులవివక్షను గుర్తించి దాన్ని రూపుమాపడానికి ప్రయత్నించాలని పేర్కొన్నది. కానీ ఎక్కడా ఆ సిఫారసు అమలుకు నోచుకోవటం లేదు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రతి నెల చివరిరోజు కులవివక్ష, అంటరానితనంపై చైతన్య సదస్సులు నిర్వహించాలని పేర్కొ న్నది. కానీ దాన్ని ఎక్కడా అమలు జరపటం లేదు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగిన సందర్భంలో ఏకైక రక్షణ కవచంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పూర్తిగా నీరుగాస్తున్నది. స్టేషన్ బెయిలిస్తూ దాడులు మరింతగా పెంచడానికి ఊతమిచ్చే విధంగా వ్యవహరిస్తున్నది.
మనువాదంతో పెరుగుతున్న కులవివక్ష
ఆరెస్సెస్-బీజేపీ మనువాద విధానాలు పల్లెలవాతవరణాన్ని చెదరగొడుతున్నాయి. కుల వివక్ష అంటరానితనాన్ని మరింతగా విస్తృత పరుస్తున్నాయి. చిన్న జీయర్స్వామి లాంటి ఆధ్యాత్మికవేత్త ‘కులం ఉండాల్సిందే, కులం పోకూడదు. ఒక మనిషి శరీరానికి కాళ్లు రెక్కలు ఎంత అవసరమో, దేశానికి కులాలు అంత అవసరం’ అని ప్రబోధిస్తున్నాడు. గ్రామ సీమల్లో దళితులు అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తే దానికి పోటీగా ఆరెస్సెస్ బీసీలను రెచ్చగొట్టి, శివాజీ విగ్రహాలను పెట్టి దళితులకు బీసీలకు మధ్య ఘర్షణలను సృష్టించడం ఎలా చూడాలి. అంటే కులాల కుంపటిని రగలించి రాజకీయాలు నడుపుతుందా? శివమాలలు వేసిన సందర్భంలో దేవాలయాలను ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేస్తున్న ఆరెస్సెస్ దళితులు శివమాలలు వేసుకుని వచ్చినా బిక్షలో కూర్చోనీయట్లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 కుల వివక్షత, అంటరానితనం, నేరం..చట్టవిరుద్ధం అని పేర్కొంటున్నాయి. కానీ దానిపై ప్రమాణం చేసి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు కుల వివక్ష రూపుమాపడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా పరోక్షంగా దాన్ని బలపరుస్తుండటం బాధాకరం.
కేవీపీఎస్ ఉద్యమ క్యాంపెయిన్
పూలే, అంబేద్కర్ ఆశయాల గురించి పలువురు పలు విధాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా దండలేసి దండాలు పెట్టి ఆయన ఆశయాలు నెరవేర్చినట్టు భావిస్తుంటారు.కానీ ఫూలే అంబేద్కర్ తమ వ్యక్తిగత జీవితంలో అనుభవించిన కుల వివక్షను పారదోలటానికి ప్రత్యక్ష ప్రతిఘటనా ఉద్యమాలు నిర్మించారు.ఆ మహానీయుల అడుగుజాడల్లో పయనిస్తున్న కేవీపీఎస్ నేటికీ కొనసాగుతున్న కులవివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటనా ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అందుకు ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలని, పూలే అంబేద్కర్ స్ఫూర్తితో ఈ పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చింది. ఆ వెలుగులో ఏప్రిల్ 1నుండి 10వరకు క్షేత్రస్థాయిలో కుల వివక్షపై సమగ్ర సర్వేలు, ఏప్రిల్ 11 నుండి 14 వరకు ఫూలే అంబేద్కర్ జన జాతర సభలు, సెమినార్లు, సదస్సులు, ఏప్రిల్ 15 నుండి 30 వరకు కుల వివక్ష పై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలని సంఘం నిర్ణయించింది. సమాజహితం కోరుకునే వ్యక్తులు శక్తులు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కేవీపీఎస్ పిలుపునిస్తోంది. చాపకింద నీరులా సాగుతున్న మనువాద సంస్కృతి, కులవివక్ష, అంటరానితనం పూర్తిగా రూపుమాపబడాలంటే పౌర సమాజమే దీనికి పూనుకోవాలి. ఈ సామాజిక మహోద్యమంలో గురుతర బాధ్యతగా భాగస్వాములై కులవివక్షను పారదోలాలి.
టి.స్కైలాబ్ బాబు
9177549646